హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): చిన్నారులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు నిర్వహించిన 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు ఆయన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినోద్కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్లో వంద సూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, సిలబస్ మార్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం, సమాజం అంటే ఏంటో తెలిపే పాఠ్యాంశాలను చేర్చబోతున్నట్టు చెప్పారు. బుక్ ఫెయిర్ నిర్వాహకులతో కలిసి గ్రంథాలయాలను గ్రామస్థాయికి తీసుకుపోయేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం
అక్షరం గూగుల్కే గురువు అని సీహెచ్ విద్యాసాగర్రావు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్లో 80 ఏండ్లకు పైబడిన రచయితలను చూస్తుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఎప్పుడైనా సమాజంలో వచ్చే మార్పును స్వాగతించాలని పేర్కొన్నారు. తాను మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన కాలంలో భాసరాచార్య గ్రంథాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేశానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ముగింపు సభలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ భరత్కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ హాజరై, ప్రసంగించారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన సభా కార్యక్రమం నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించిన బుక్ ఫెయిర్ను సుమారు 10 లక్షల మంది సందర్శించారని నిర్వాహకులు తెలిపారు. ఓయూ ఆంగ్ల విభాగ ఆచార్యులు కొండా నాగేశ్వర్, బుక్ఫెయిర్ కోశాధికారి రాజేశ్వర్రావు, కార్యదర్శి శృతికాంత్ భారతి, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, నారాయణరెడ్డి, వాసు పాల్గొన్నారు.
పోలవరం..పల్లెలకు ప్రాణ సంకటం
పోలవరం ప్రాజెక్టు తెలంగాణ పల్లెలకు ప్రాణ సంకటంగా మారిందని డాక్టర్ కేజీ సంధ్యా విప్లవ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆమె రచించిన ‘ఆద్యంతం’ పుస్తకంపై బుక్ ఫెయిర్ ముగింపు సభలో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ముఖ్యంగా ఆదివాసీ గూడేలతోపాటు వారి అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గిరిజన తెగల జీవనంలో దైవ సమానమైన వన వృక్షాలు, పలు జీవరాసులు, జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని తెలిపారు. తన పుస్తకంలో ఈ ప్రాజెక్టుపై ఎన్నో ప్రశ్రలు సంధించానని సంధ్యా విప్లవ్ చెప్పారు.
– ఆద్యంతం పుస్తక రచయిత డాక్టర్ కేబీ సంధ్యా విప్లవ్