కామారెడ్డి, జనవరి 31: బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్ శామ్కోషి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తాధ్వర్యంలో ‘మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రసంగించారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేస్తే తల్లిదండ్రులు, పెద్దలు, మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాల నివారణ, మహిళలపై వేధింపుల నిరోధానికి చట్టాలపై అవగాహన అవసరమని హైకోర్టు న్యాయమూర్తి నర్సింగరావు నందికొండ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జిలు సుష్మ, దీక్ష, భార్గవి పాల్గొన్నారు.