రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుకల పేరుతో ఈ వివాహ వేడుకను నిర్వహించారు తల్లిదండ్రులు.
అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి.. బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ పాప అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మొత్తంగా ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు పాపిరెడ్డిగూడ చేరుకుని బాధితురాలిని చేరదీశారు. తనకు బర్త్ డే పేరిట పెళ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులకు, ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.