హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్లో బీజేపీ నిర్వహించింది నిరుద్యోగుల మార్చ్ కాదు.. లీకువీరుల మార్చ్, రాజకీయ నిరుద్యోగుల మార్చ్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. అదో పచ్చి అబద్ధాల మార్చ్ అని మండిపడ్డారు. బీజేపీ నేతలకు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికహక్కు లేదని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యపై తెలంగాణలో కాకుండా ఢిల్లీలో మార్చ్ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సవాల్ చేశారు. విభజన చట్టం అమలుకు ఢిల్లీలో ధర్నా చేస్తే తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఐటీఐఆర్తోపాటు రెండు కోట్ల ఉద్యోగాలపై ప్రధాని మోదీని నిలదీయాలని సూచించారు. వరంగల్ మార్చ్కు విద్యార్థులెవరూ రాలేదని, అడ్డా కూలీలను తీసుకొచ్చారంటూ కొన్ని ఫొటోలను, పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దఫాలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీచేసిందని, ఈ దఫా 10 వేల కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్తోపాటు మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నదని వివరించారు. పదో తరగతి పేపర్ల లీకేజీ కుట్రదారు బండి సంజయేనన్న విషయం వాట్సాప్ చాట్లతో రుజువైందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీది గాంధీ సిద్ధాంతం.. బీజేపీది గాడ్సే సిద్ధాంతమని వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణం గా విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రా ధాన్యం ఇస్తున్నారని, ఈ అభివృద్ధిపై 125 అ డుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు బీజే పీ నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన అభివృద్ధి ఏమిటో.. రాష్ట్రం చేసిందేమిటో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
శ్వేతపత్రం ప్రకటించండి:
మోదీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రాన్ని విడుదలచేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న బీజేపీ నేతలు ముందు తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బలం, బలగం గురించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. సమావేశంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.