హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రం మిథ్య’ అని అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల నాడు నందమూరి తారకరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్య. ఈ దేశంలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా ఈ మాట నిజమేననిపిస్తున్నది. ఆయా సందర్భాల్లో అన్ని రాష్ర్టాలకూ అనుభవంలోకి వచ్చిన విషయమే ఇది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అయితే.. కేంద్రం పీటముడులు అన్నీ ఇన్నీ ఉండవు. ఇక విపక్షమైతే అంతే సంగతులు.. ప్రాంతీయ పార్టీలైతే కేంద్ర ప్రభుత్వాలకు లెక్కే లేదు. రాష్ర్టాలు తమను దేహీ అని యాచించాలన్న ధోరణి.. దేశ సమగ్రాభివృద్ధికి పెను అడ్డంకిగా మారింది.
అందువల్లనే స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి రాష్ర్టాలు ఏదోవిధంగా పోరాటం చేయాల్సి వస్తున్నది. ప్రాంతీయ పార్టీల శకం మొదలైన తరువాత కేంద్రం నిరంకుశత్వం మరింత పెరిగిపోయింది. ప్రాంతీయ పార్టీలకు తమ ప్రాంతంలోని ప్రజల అవసరాలు.. ప్రయోజనమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. కానీ ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ర్టాలను సమన్వయ పరచుకొని ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ పరిస్థితి లేకుండాపోయింది.
మరీ ముఖ్యంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ర్టాల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. చాలా రాష్ర్టాల్లో ప్రభుత్వాధినేతలు ప్రత్యక్షంగా పోరాటం చేయాల్సిన అవసరం, అగత్యం ఏర్పడుతున్నది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. గవర్నర్ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అన్యాయంగా పడగొడితే.. ఆనాడు ఎన్టీయార్ ప్రజాపోరాటం చేయాల్సివచ్చింది. ఆ తరువాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులకు చేదు అనుభవాలు ఎదురైనాయి.
పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఒడిశాలో నవీన్ పట్నాయక్, పంజాబ్లో అమరిందర్సింగ్, తమిళనాట కరుణానిధి, జయలలిత, కేరళలో విజయన్.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకోసం, రైతులకోసం.. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో తలపడాల్సి వచ్చింది. వస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు లాంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ప్రజాదరణ కోసం దీక్షలు చేసినప్పటికీ.. ఎక్కువమంది ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకోసం కేంద్రంపై అలుపెరుగకుండా పోరాడినవాళ్లే.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 11 రాష్ర్టాలు తమ శాసనసభల్లో తీర్మానాలుచేశాయి.
వీటిని స్వయంగా ఆయా రాష్ర్టాల సీఎంలే ప్రవేశపెట్టారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న జరిగిన భారత్ బంద్కు బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు సంఘీభావం ప్రకటించారు. కరోనా టీకాల బాధ్యత రాష్ర్టాలదేనని కేంద్రం చేతులు ఎత్తేసినప్పుడు ముఖ్యమంత్రులు (చివరకు కొందరు బీజేపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సహా) తీవ్రంగా వ్యతిరేకించారు. తమతో కలిసి రావాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ మిగిలిన సీఎంలకు లేఖలు రాశారు.
తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ప్రతి నిరసన పిలుపు తన
ప్రజలకోసం, తన రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగమే. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లోనే రాష్ట్ర బంద్ ప్రకటించారు. కేంద్ర రైతు వ్యతిరేక చట్టాలకు, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు తెలిపింది. ఇప్పుడు రైతుల పక్షాన ధాన్యం కొనుగోలు కోసం మళ్లీ ఉద్యమ పతాకనెత్తారు. కాంగ్రెస్ అయినా.. ప్రస్తుత బీజేపీ అయినా కేంద్రంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యం తరుచూ బయట పడుతూనే ఉంది. దీంతో ప్రజా ప్రయోజనాలను రక్షించేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలే నిరసనకు
దిగుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
వంటివారు మొదటి నుంచీ కేంద్రంపై
పోరాడుతూనే ఉన్నారు.
తేదీ: 2014 జనవరి 21 స్థలం: ఢిల్లీ
ఢిల్లీ మాల్వియానగర్లోని ఓ ఇంట్లో డ్రగ్స్, సెక్స్ రాకెట్ నడుస్తున్నదని, వెంటనే దాడులు చేయాలని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్నాథ్ భారతి జనవరి 14న పోలీసులను ఆదేశించారు. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సీఎం హోదాలో ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినా.. అది కేంద్రం పరిధిలో ఉండటంతో కేజ్రీవాల్ నిస్సహాయంగా ఉండిపోయారు. దీంతో ఢిల్లీ పోలీస్ విభాగాన్ని కేంద్రం పరిధి నుంచి తొలిగించి రాష్ర్టానికి అప్పగించాలని, సహకరించని ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన జనవరి 21న ధర్నాకు దిగారు.
ఫలితం: కేంద్రం ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నది.
తేది : 2020 డిసెంబర్ 3
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ మూడు రోజులపాటు ఆందోళనలు చేపట్టింది.
తేదీ: 2018 జూన్ 11, స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు 4 నెలలపాటు ప్రభుత్వానికి సహకరించలేదు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్లో ధర్నాకు దిగారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫలితం: కేజ్రీవాల్ ధర్నా, ఢిల్లీ హైకోర్టు మొట్టికాయల ఫలితంగా కేంద్రం దిగివచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ఐఏఎస్లు ప్రకటించారు.
తేదీ: 2020 నవంబర్ 4, స్థలం: ఢిల్లీ
పంజాబ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదంటూ సీఎం అమరీందర్ సింగ్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేశారు. కేంద్రం పంజాబ్కు గూడ్స్ రైళ్లను నిలిపివేసిందని, దీంతో బొగ్గు రవాణా తగ్గిందని, జీఎస్టీ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు.
ఫలితం: రైళ్లను పునరుద్ధరిస్తామని నవంబర్
22న రైల్వే శాఖ ప్రకటించింది.
తేది: 2020 నవంబర్ 15, స్థలం: కేరళ
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన లైఫ్ మిషన్, కే-ఫోన్ ను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు అడ్డుకొంటున్నాయని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం ధర్నాకు పిలుపునిచ్చింది. ‘కేరళను రక్షించండి’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల కేంద్రాల్లో ఎల్డీఎఫ్ శ్రేణులు ధర్నాకు దిగాయి.
తేదీ: 2019 జనవరి 8, స్థలం: ఢిల్లీ
వరికి మద్ధతు ధర పెంచాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. క్వింటాలుకు రూ.2,930 ఇవ్వాలని కోరుతూ ఒడిశా రైతుల పక్షాన డిమాండ్ చేశారు. ఒడిశా అంసెంబ్లీలో తీర్మానంచేశారు.
ఫలితం: కేంద్రం స్పందించలేదు. కేవలం రూ.65 పెంచుతున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకొన్నది.
అంశం: భారత్ బంద్
తేదీ: 27-09-2021
రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చ ఇచ్చిన
భారత్ బంద్కు బీజేపేతర రాష్ర్టాలు
మద్దతు పలికాయి.