హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సమ్మక్క సాగర్ ముంపుపై చర్చించేందుకు రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నదని, ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీనే చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ చైర్మన్కు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. సమ్మక్క సాగర్ బరాజ్ అనుమతుల కోసం డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఇప్పటికే అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు వచ్చినా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతో ఇంటర్స్టేట్ డైరెక్టరేట్ వద్ద అనుమతుల ప్రక్రియ పెండింగ్ పడింది.
సమ్మక్క సాగర్ బరాజ్ 83 ఫీట్ల వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు ఛత్తీస్గఢ్లో కొంత భూమి ముంపునకు గురవుతున్నది. అందుకు నష్ట పరిహారం చెల్లించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి ఎన్వోసీ తెస్తేనే అనుమతులు మంజూరు చేస్తామని సీడబ్ల్యూసీ తెలంగాణకు సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అనేకసార్లు సంప్రదింపులు జరిపింది. నష్ట పరిహారం కూడా అందిస్తామని స్పష్టం చేసింది. మహారాష్ట్రకు అవకాశం కల్పించినట్టు, ఛత్తీస్గఢ్కు కూడా నీటి వినియోగానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. సమావేశానికి తేదీని నిర్ణయిస్తే తామే స్వయంగా ఛత్తీస్గఢ్కు వస్తామని, మీరైనా రావొచ్చని విన్నవించింది. అయినా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించటం లేదు. మరోవైపు, నిర్ణీత గడువులోగా ఎన్వోసీ తీసుకురాకపోతే డీపీఆర్ను వెనక్కి పంపుతామని సీడబ్ల్యూసీ ఇటీవలే తెలంగాణకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని వివరిస్తూ సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీడబ్ల్యూసీనే చొరవ తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.