హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దార్శనికత చాలా గొప్పదని ఛత్తీస్గఢ్ ఇంజినీర్ల బృందం కొనియాడింది. ఇటీవల సమ్మక్కసాగర్ బరాజ్ ముంపు పరిశీలన కోసం తెలంగాణకు వచ్చిన బృందం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ, అన్నారం బరాజ్ను సందర్శించింది. శుక్రవారం నంది పంప్హౌస్, ఎల్లంపల్లి రిజర్వాయర్ను పరిశీలించింది. నయా రాయ్పూర్ జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ గురువార్, మహానంది ప్రాజెక్టు ఇన్చార్జి, విశ్రాంత సీఈ నగారియా, ఇంద్రావతి ప్రాజెక్టు సర్కిల్ బండారికి రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆయా ప్రాజెక్టుల విశిష్టతలను వివరించారు.
ఈ సందర్భంగా ఇంజినీర్ల బృందం మాట్లాడుతూ స్వల్పకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడం అద్భుతమని కితాబిచ్చింది. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును తీర్చిదిద్దిన విధానం, అకుంఠిత దీక్షతో నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో కేసీఆర్కే చెల్లిందని హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ నైపుణ్యాలను అభినందించింది. అనంతరం బృందం ఛత్తీస్గఢ్కు తిరిగి వెళ్లిపోయింది.