వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ను నిర్మించరాదని, దీన్ని వేరే చోటుకు మార్చాలని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి శనివారం లోక్సభలో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని కోరారు. పార్లమెంటులో 377వ నిబంధన కింద ఆయన ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించి.. నేవీ రాడార్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించారు.
రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల 400 ఏండ్ల పురాతనమైన రామలింగేశ్వర దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతోపాటు రాడార్ ఏర్పాటు వల్ల ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని స్థానికుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. పూడూరు మండల ప్రజానీకం నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నట్టు ఆయన సభ దృష్టికి తెచ్చారు. స్థానికుల ఆందోళనలను పరిశీలించి కేంద్ర రక్షణ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేవీ రాడార్ స్టేషన్ను దామగుండం నుంచి మరో అనువైన ప్రదేశానికి మార్చాలని రంజిత్రెడ్డి కోరారు.