Cheetah Died | రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐదారు రోజుల కిందటే చిరుత మృత్యువాతపడిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సమాచారం అందుకున్న అధికారులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత మృతికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతం 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
మొదట అటవీ ప్రాంతానికి వెళ్లిన గొర్రెలకాపరులకు చిరుత కళేబరం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు వివరించారు. చిరుతల సంచారంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాల వైపునకు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.