హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని రేవంత్రెడ్డి సర్కార్ టార్గెట్ చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ఎండగడుతుండమే ఇందుకు కారణమా? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన పల్లా రాజేశ్వర్రెడ్డిని దెబ్బతీసేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. పల్లాతోపాటు ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, వ్యాపారాలను దెబ్బతీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ వివిధ శాఖలను ప్రయోగిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏమీ లేకపోయినా, ఏమీ దొరక్కపోయినా దాడుల మీద దాడులు కొనసాగుతుండటం గమనార్హం. తాజాగా పల్లా రాజేశ్వర్రెడ్డి సోదరుడు పల్లా కృష్ణకు చెందిన ఉప్పల్లోని రీడర్స్స్టోర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో గురువారం రాత్రి నుంచి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకే తనిఖీలు చేస్తున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రకటించారు.
రెండు రోజులపాటు సోదాలు, తనిఖీలు చేసిన అధికారులు ఏమీ తేల్చలేకపోయారు. పల్లాను ఇబ్బంది పెట్టడం ఇదేమీ కొత్తకాదు. తొలుత పల్లాకు చెందిన విద్యాసంస్థలపై ప్రభుత్వం గురిపెట్టింది. ఉన్నతాధికారులను సమీక్షకు పిలిచి ప్రైవేట్వర్సిటీల్లో రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించింది. దేశంలో ఒక్క ఉత్తరప్రదేశ్లో తప్ప ఎక్కడా రిజర్వేషన్లు అమలుచేయడం లేదని, అక్కడ ప్రత్యేకంగా చట్టం చేశారన్న విషయాన్ని తెలుసుకొని ఈ విషయంలో పల్లాను ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత భూకబ్జాలంటూ తమ పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్నతో ఫిర్యాదు చేయించారు. గత నాలుగేండ్లుగా తీన్మార్ మల్లన్న ఇవే ఆరోపణలు చేయడం తప్ప ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను లాగారు. విద్యుత్తు సంస్థల్లో అక్రమ నియామకాలంటూ తప్పుడు ప్రచారం చేశారు. తీరా వాస్తవాలు వెల్లడించాక నాలుక్కరుచుకున్నారు. ఇప్పుడు తాజాగా పల్లా కృష్ణకు చెందిన రీడర్స్స్టోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కూడా ఏమీ తేల్చలేకపోవడం గమనార్హం.