హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ముప్పిరిగొన్న నేపథ్యంలో చుట్టుముట్టిన బ్లాక్ ఫంగస్కు సరైన చికిత్స లభించక ఎంతోమంది అల్లాడిపోయారు. అందుబాటులో ఉన్న అల్లోపతి మందులు కొరతగా ఉన్నప్పటికీ.. అవి బాగా ఖరీదైపోయాయి. వీటిని సమకూర్చుకోవడం సమస్యాత్మకమైంది. బ్లాక్ఫంగస్ వైద్యానికి ఇది పూర్తిస్థాయి పరిష్కారం కాదని గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యామ్నాయ వైద్య విధానంపై దృష్టిసారించారు. సంప్రదాయ ఆయుర్వేదంలో నూతన ఆవిష్కారానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఆయుష్ విభాగంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అనంతరం కోఠి ఈఎన్టీ, గాంధీ దవాఖానల్లోని బ్లాక్ ఫంగస్ పేషంట్లకు తెలంగాణ ఆయుష్ విభాగం ఆయుర్వేద మందులను కూడా అందిస్తూ అధ్యయనం చేసింది. ఈ ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. అల్లోపతి మందు ప్రభావాన్ని నిర్వీర్యం చేయకుండానే.. బ్లాక్ ఫంగస్ను పారదోలే నూతన వైద్యవిధానాన్ని ఆయుష్ విభాగం కనుగొన్నది.
అల్లోపతితోపాటే.. ఆయుర్వేదం
బ్లాక్ ఫంగస్ చికిత్స విధానంపై దేశవ్యాప్తంగా సరైన అవగాహన లేకపోవడం, అందుబాటులో ఉన్న అతి కొద్ది ఔషధాల ధరలు లక్షల్లో ఉండటం పెనుసవాల్గా మారింది. లైఫోసోమల్ ఆంఫోటెరిసిన్, పొసకొనజోల్ వంటి మందులను సరఫరా చేయడంలో కేంద్రం సైతం చేతులెత్తేసింది. అంతర్జాతీయంగా పలుదేశాలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ఔషధాలను సమర్థంగా వినియోగిస్తూనే ప్రత్యామ్నాయ చికిత్స విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. సనాతన వైద్య విధానాలను ప్రోత్సహించారు. ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియో వైద్యవిధానాల ద్వారా బ్లాక్ ఫంగస్ను కట్టడి చేసే మార్గాలను అన్వేషించాలని ఆయుష్ విభాగాన్ని ప్రోత్సహించారు. సీఎం ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్న ఆయుష్ విభాగం నూతన చికిత్స విధానంపై ప్రయోగాలు ప్రారంభించింది. ఇందుకు అల్లోపతి వైద్యుల సహకారాన్ని కూడా తీసుకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందించింది. దేశంలోనే తొలిసారి ఈ తరహా అధ్యయనానికి అడుగు పడింది.
ఫలించిన సీఎం వ్యూహం..
గాంధీ, కోఠి ఈఎన్టీ దవాఖానల్లో ఎంపిక చేసిన 137 పేషెంట్లకు అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద ఔషధాలను అందించి పరిశీలించారు. కేవలం అల్లోపతి మందులు వాడుతున్న రోగులకంటే.. అల్లోపతితోపాటు ఆయుర్వేద మందులను కూడా వాడిన రోగుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. జబ్బు తగ్గుదలలో వేగం పెరిగింది. దుష్ప్రభావాలు కూడా కనిపించలేదు. వీరిలో 70 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం విజయవంతమైంది. బ్లాక్ఫంగస్కు చికిత్స చేసుకొని డిశ్చార్జి అయిన తర్వాత మళ్లీ దవాఖానకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. డిశ్చార్జి అయిన రోగులు.. ఇంటివద్ద కూడా పొసకొనజోల్ అనే మందును కొన్ని రోజులు వినియోగించాల్సి ఉంటుంది. కానీ.. అల్లోపతితోపాటు ఆయుర్వేదాన్ని కూడా వాడిన రోగులకు ఆ అవసరం లేకుండాపోయింది. దీంతో రోగులకు మందుల భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆయుష్ విభాగం మొదలు పెట్టిన ప్రయత్నం.. సీఎం కేసీఆర్ తోడ్పాటుతో విజయవంతమైంది. ఈ చికిత్స విధానంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నట్టు వైద్యాధికారులు చెప్తున్నారు. త్వరలో తమ వైద్య విధానాన్ని జర్నల్లో ప్రచురించనున్నట్టు తెలిపారు.