హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పనస పొట్టు మధుమేహానికి చెక్ పెడ్తున్నదని తేలింది. షుగర్ వ్యాధి చికిత్సలో పచ్చి పనస పొట్టు పిండి అద్భుతంగా పనిచేస్తున్నదని శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ బాధితుల రక్తంలో షుగర్ స్థాయిలను ఇది బాగా నియంత్రిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను ‘జాక్ఫ్రూట్ 365’ సంస్థ ఆదివారం వెల్లడించింది. నిత్యం 30 గ్రాముల పచ్చి పనస పొట్టు తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది.
18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉండి మధుమేహానికి మందులు వాడుతున్న వారిపై వైద్యులు పరిశోధన చేశారు. 40 మందిని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపులోని వారికి రోజూ 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలు అందించారు. మరో గ్రూపులోని వారికి ఇదే మోతాదులో ఇతర పదార్థాన్ని అందించారు. 12 వారాల సమయంలో వారి రక్తంలో గ్లూకోజ్, పీపీజీ, కొవ్వుల స్థాయిలు, బరువు, ఇతర ఆరోగ్య సమస్యలను పరిశీలించారు. పనస పొట్టు వాడినవారిలో మధుమేహం బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించారు.
అమెరికా పరిశోధకులు కూడా పనస మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్టు గుర్తించారని సంస్థ వెల్లడించింది. పనసలోని విటమిన్ ఏ, సీ, బీ6 తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ వంటివి మంచి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. పనస తొనలను తరచూ తీసుకోవడం వల్ల కంటిచూపు కూడా మెరుగ్గా ఉంటుంది. పనసలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం, అల్సర్లు వంటి సమస్యలను తగ్గిస్తుందని జాక్ఫ్రూట్ 365 సంస్థ పేర్కొన్నది.