హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లడ్ షుగర్ను అదుపులో ఉంచుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా నివారించవచ్చని పలువురు ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్ నుంచి బయటపడినవారు పరిశుభ్రత, మంచి ఆహారం, షుగర్ను అదుపులో ఉంచుకోవడం వంటి నియమాలు పాటిస్తే.. ఇది సోకే అవకాశాలు తక్కువని చెప్పారు. త్వరగా చికిత్స ప్రారంభిస్తే మెదడుకు పాకకుండా నివారించి, ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని తెలిపారు. తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య(ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ‘బ్లాక్ ఫంగస్పై పోరాటం’ అనే అంశంపై శుక్రవారం వెబినార్ నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, ఏఐజీ దవాఖాన ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ సిస్ట్లా, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన అసోసియేట్ ఆప్తమాలజిస్టు డాక్టర్ తర్జనీ దవే తదితరులు వెబినార్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలు నమ్మి, ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ అనేది బ్లడ్ వెసల్స్లోకి ప్రవేశించి, రక్తాన్ని ఇతర అవయవాలకు సరఫరా కాకుండా నిరోధిస్తుందని, దీంతో కణజాలం ఫంక్షన్ దెబ్బతింటుందని వివరించారు. బ్లాక్ ఫంగస్ సోకినవారికి ముక్కులో నొప్పి, కన్ను వెనకాల నొప్పి, కంటివద్ద వాపు, చూపులో తేడా లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కొన్ని సందర్భాల్లో కంటిచూపు పోతుందని, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ముందుగా ముక్కు, తరువాత కండ్లు, అనంతరం మెదడుపై ఫంగస్ దాడి చేస్తుందని చెప్పారు. ఒక్కొక్కసారి కండ్లను తొలిగించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరు రోజుల్లోగా చికిత్స మొదలు పెడితే 70 శాతం వరకు చికిత్స విజయవంతం అవుతుందని, ఆలస్యమైనాకొద్ది సక్సెస్ రేటు పడిపోతుందని వివరించారు. మెదడుకు పాకితే ప్రాణాపాయం తప్పదని, ఇన్ఫెక్షన్ ముదిరితే మరణాల రేటు 80 శాతం వరకు ఉంటుందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ అనేది ఫలానా డ్రగ్ వాడినందువల్లనో, యాంటీ బయోటిక్స్ వల్లనో, ఆక్సీజన్ థెరపీ వల్లనో వచ్చిందనడానికి వీల్లేదని, వాట్సప్లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు. రెగ్యులర్ సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని పేర్కొన్నారు. గతంలో బ్లాక్ ఫంగస్ కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స అందరికీ ఒకేవిధంగా ఉండదని, ఇతరుల ప్రిస్క్రిప్షన్ను మరొకరు ఉపయోగించరాదని స్పష్టంచేశారు. ప్రభుత్వ రెగ్యులేషన్ ప్రకారం దీని చికిత్సలో మూడు రకాల డ్రగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశంలో ఈ వ్యాధి అధికంగా రావడానికి మధుమేహం ప్రధాన కారణమని వివరించారు.