హైదరాబాద్ను ఆనుకొని ఉన్న భువనగిరిని ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా తెలంగాణ ఇలవేల్పు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. పోచంపల్లి చేనేత కార్మికుల కళానైపుణ్యానికి ప్రోత్సాహం అందలేదు. పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్యంతోపాటు ఇతర రంగాల్లోనూ ఎలాంటి పురోగతి కానరాలేదు. ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ సంకల్పంతో పునరుద్ధరించిన యాదగిరిగుట్ట ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్నది. చౌటుప్పల్ దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు దేశానికే తలమానికంగా మారింది. కాళేశ్వర జలాలతో జిల్లా సస్యశ్యామలంగా మారింది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ యావత్ దేశం అబ్బురపడేలా యాదగిరిగుట్టను మలిచారు. ఇందుకు దాదాపు రూ.1200 కోట్లకుపైగా ఖర్చు చేశారు. నిత్యం సగటున 20 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పారిశ్రామికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపట్టింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ఏర్పాటుచేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ప్రస్తుతం 50కిపైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. మరో 150 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 400 పరిశ్రమలు రానున్నాయి. దాంతో 40 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. వ్యవసాయ రంగంలోనూ కేసీఆర్ సర్కారు విప్లవాత్మక చర్యలు చేపట్టింది. కాళేశ్వరం-16వ ప్యాకేజీలో భాగంగా భువనగిరి మండలంలో రూ.1,059 కోట్లతో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ పూర్తయితే 1.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఇప్పటికే బస్వాపూర్ రిజర్వాయర్తో యాదగిరిగుట్ట నర్సన్న పాదాలను గోదావరి జలాలు ముద్దాడాయి. 2020లోనే కొండపోచమ్మసాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలారామారం మండలాలకు నీరు అందింది.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు..
భూదాన్పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామం లో 22 ఎకరాల్లో పెట్టిన హ్యాండ్లూమ్ పార్కును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈ పార్కు అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది చేనేత కార్మికులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడనున్నది. ఇందులో వచ్చిన ఆదాయాన్ని పోచంపల్లి కార్మికుల కోసమే ఖర్చు చేస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. తుర్కపల్లిలో మరో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయింది. ఇప్పటికే పార్కు ఏర్పాటుకు 93.21 ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ నిర్మాణం కానున్నది. కల్లు గీత కార్మికుల జీవన స్థితిగతులు మార్చే లక్ష్యంగా భువనగిరి మండలంలోని నందనంలో నీరా ప్లాంట్ సిద్ధమవుతున్నది.