బొక్కలు వంగి..బతుకులు కుంగి లక్షలమంది జీవచ్ఛవాలుగా మారితే కేంద్రంలో అధికారం వెలగబెట్టిన బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదు. నాటి ప్రధాని వాజ్పేయి టేబుల్ మీద ఫ్లోరైడ్ బాధితుడిని పడుకోబెట్టి, గోడు వెళ్లబోసుకున్నా కనికరించలేదు. మానవత్వంతో స్పందించలేదు. మంచినీళ్లు ఇచ్చే ప్రయత్నమే చేయలేదు.
ఫ్లోరైడ్ మహమ్మారిని మట్టుబెట్టి..మంచినీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన మహత్తర పథకం మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే నీతిలేని మోదీ సర్కారు 19 పైసలు కూడా ఇయ్యలేదు. కానీ..ఒక చిన్న కంపెనీ ఓనర్నని చెప్పుకుంటున్న రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు బీజేపీ పెద్దలు. ఎన్నో పోరాటాల ఫలితంగా మంజూరయ్యి, చౌటుప్పల్లో ఏర్పాటు కావలసిన ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ను గద్దలా వేరే రాష్ట్రానికి తన్నుకుపోయి నల్లగొండకు తీరని ద్రోహం చేసింది బీజేపీ. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో నాటి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.ఫ్లోరైడ్ బాధితులకు ఆర్థిక సాయం చేస్తామని చేసిన వాగ్దానం గాలికిపోయింది..వంచనే మిగిలింది.
బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది మోదీ సర్కారు.ఉచిత విద్యుత్తును బందుపెట్టి, బోరుబావుల కింద కరెంట్తో వ్యవసాయం చేసుకుంటున్న 30 లక్షల మంది రైతుల నోట్లో మట్టిగొట్టాలని చూస్తున్నది కేంద్రం.
రైతులపై పగబట్టిన బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడితేనే ఏడాదికి రూ. 6 వేల కోట్ల రుణం ఇస్తమని షరతులు పెట్టి రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేసింది. రైతుల ప్రయోజనం కల్పించడం కోసం సుమారు రూ. 30 వేల కోట్ల రుణాన్ని వదులుకుంది కేసీఆర్ ప్రభుత్వం.యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ప్లాంట్కు రుణాలు నిలిపేసి, ప్రాజెక్టుకు అడ్డుపుల్లలు వేస్తూ తెలంగాణను చీకట్లోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నది కేంద్రం.
నరేంద్ర మోదీ హయాంలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది..మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సిన పరిస్థితి దాపురించింది. వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం. 2014లో 410 రూపాయలు వున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు దాటింది. పేదల బతుకులకు గుదిబండగా మార్చింది.
అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సు లు వడ్డించి, పెట్రోల్ డీజిల్ ధరలను సెంచరీ దాటించిన ఘనుడు మోదీ. ముడి చమురు ధర పెరగకున్నా, అదనపు సెస్సులు మోత మోగించి చమురు రేట్లను పెంచి, జనం చేతి చమురు వదిలించింది బీజేపీ ప్రభుత్వం.
చరఖా తిప్పి, నూలు వడికి చేనేతను స్వదేశీ ఉద్యమానికి ప్రతీకగా నిలబెట్టిండు గాంధీ మహాత్ముడు. ఇప్పుడు మోదీ వచ్చి చరిత్రలో తొలిసారి చేనేతపైన పన్నువేసి మగ్గానికి మరణశాసనం రాస్తున్నడు.5 శాతం జీఎస్టీ విధించడమే కాదు. దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసి…బట్టలు నేసే వాళ్ళ పొట్ట కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది మోదీ ప్రభుత్వం.స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీని దేశ నేతన్నలకు అప్పగించకుండా, చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం పట్టించింది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం.
మోదీ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా రూపాయి గింగిరాలు తిరిగి పాతాళానికి పడిపోయింది. మారకం విలువ 83 రూపాయలకు చేరి, జీవిత కాల కనిష్ఠానికి దిగజారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతమైతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లకు బైబై చెప్పి, పెట్టుబడులు వెనక్కితీసుకుంటున్నారు.
ప్రభుత్వ రంగాన్ని అంగట్లో వేలానికి పెట్టి, అడ్డికి పావుశేరు చొప్పున అమ్మేస్తున్నది మోదీ సర్కారు. రైళ్లు, విమానాలు, పోర్టులు, ఎల్ఐసీ, బంకులు, నవరత్నాలు, మినీ రత్నాలను తెగనమ్ముకుంటున్నారు. డిజిన్వె స్ట్మెంట్ పేరుతో 35 సంస్థలను, 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు.
పేదలను కొట్టి, పెద్దలకు పెట్టే విధానం అవలంబిస్తున్న బీజేపీ, కార్పొరేట్ టాక్స్ను ఏకంగా ఒకేసారి 10 శాతం తగ్గించి బడా బాబులకు వరాలిచ్చింది. పాలు, పెరుగు, పప్పు, ఉప్పులపై జీఎస్టీని పెంచి సామాన్యుల బతుకులను దుర్భరం చేశారు. బ్యాంకులను ముంచి, బకాయిలను ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కారు జాలిపడి, ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ (రైటాఫ్) చేసి వాళ్ల రుణం తీర్చుకుంది. కానీ, కాలే కడుపులకు ఆసరానిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ, వాటిని రద్దు చేయించడానికి కుట్రలు చేస్తున్నది.
ఎనిమిదేండ్ల మోదీ హయాంలో దేశంలో ఆకలి కేకలు పెరిగాయి. అన్నమో రామచంద్రా అని అలమటించే అభాగ్యుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత దేశ ర్యాంకు దారుణంగా దిగజారి 107 స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ లాంటి దేశాల కంటే ఘోరంగా మారింది మన స్థితి. దేశ ప్రగతిని సూచించే ఇండెక్స్ ల్లో భారత్ తిరోగమనంలో పయనిస్తున్నది. పాస్ పోర్ట్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్, జెండర్ ఇండెక్స్, డెమెక్రసీ ఇండెక్స్ ప్రతి సూచీలోనూ పతనమే.
పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ర్ట అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం చెప్పకుండా 5 ఏండ్లు తొక్కిపెట్టి గిరిజన ద్రోహానికి పాల్పడింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్లో ప్రశ్న అడిగితే ఆ ప్రతిపాదనే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి తెలంగాణ గిరిజన బిడ్డల హక్కులను చులకనగా చూసి అవమానించిన దుష్ట పార్టీ బీజేపీ.
బీజేపీ పరిపాలిస్తున్న పక్కరాష్ర్టం కర్ణాటకలో కల్లు గీతను నిషేధించి, గీత కార్మికుల కడుపుకొడుతున్నరు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి కల్లుగీతకు అనుమతిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడన్నలను మోసం చేస్తున్నరు. గౌడన్నల జీవనోపాధిని హరించడమేగాక, వారి ఆందోళన్లను అణిచివేస్తున్నది.
బీసీల జనగణన చేయాలన్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలు తీర్మానాలు చేసి పంపినా, బహుజనుల ఆకాంక్షను పక్కన పడేసింది. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలన్న డిమాండ్నూ పక్కన పెట్టింది.
కార్పొరేట్ దోస్తుల సేవలో తరిస్తున్న కాషాయ పార్టీ పేదల సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టేందుకు ఉచితాలు వద్దని కొత్త పాట పాడుతున్నది. మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న 2 లక్షల 38 వేల 915 మంది లబ్ధిదారుల నోటి కాడ ముద్దను లాక్కుంటారా? లక్షా 46 వేల 284 మంది అన్నదాతలకు రైతుబంధు పైసలు రానివ్వరా?39,866 మంది అభాగ్యుల ఆసరా పెన్షన్లను ఆపేస్తరా? ఆడపిల్లల కళ్యాణలక్ష్మి కానుకను కట్ చేస్తరా? బిడ్డని కనే తల్లులకు కేసీఆర్ కిట్ క్యాన్సిల్ చేస్తరా? యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ బంద్ చేస్తరా? ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పగలదా?
ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. 8 ఏండ్లలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాలపై ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల ముచ్చట్లు చెప్తున్నరు. కేంద్రంలో ఖాళీగా వున్న 16 లక్షలకు పైగా పోస్టులను భర్తీ చేయకుండా దగా చేస్తున్నరు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ లక్షల ఉద్యోగాలకు పాతరేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి, లక్షల ఐటీ ఉద్యోగాలకు గండికొట్టింది. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్ఠానికి ఎగబాకింది.
కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్, లాతూర్ లకు తరలించి తెలంగాణకు ద్రోహం చేసింది. బయ్యారం ఉక్కు ఫాక్టరీపై తుక్కు వాదనలు చేస్తూ, ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావుకబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని ఆవిరి చేశారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా ఇవ్వకుండా తెలంగాణ రైతాంగంపై పగబట్టింది. వెనుకబడిన జిల్లాల అభివద్ధి నిధులను ఎగ్గొడుతున్నది మోదీ ప్రభుత్వం. షెడ్యూల్ 9,10 సంస్థలను విభజించకుండా నాన్చుతున్నది. ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాను అప్రజాస్వామికంగా లాగేసుకొంది. లోయర్ సీలేరు ప్రాజెక్టును దూరం చేసి రాష్ట్రానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నది.
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని రప్పిస్తామని రంకెలు వేసినవాళ్ళు, ఇప్పుడు నల్లధనం ఎక్కడా అని అడిగితే తెల్లముఖం వేస్తున్నారు. ప్రతీఒక్కరి జన్ధన్ ఖాతాల్లో ధన్ధన్ మని రూ.15 లక్షలు వేస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని పచ్చిమోసానికి పాల్పడ్డారు.
దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెప్తున్నా, తెలంగాణలోని కొత్త జిల్లాలకు మొండిచేయి చూపింది. గత ఎనిమిదేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాలలో నెలకొల్పిన కేంద్రం, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్శిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, కొర్రీలు పెడుతున్నది.
కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది కేంద్రం లోని బీజేపీ. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రిఫర్ చెయ్యాలని 8 ఏండ్ల నుంచి కోరుతున్నా…అంతులేని జాప్యం చేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నది.
575 టీఎంసీల న్యాయమైన వాటా దక్కకుండా చేస్తూ, ఉమ్మడి నల్లగొండ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. కేంద్రం నిర్వాకం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలు వందల టిఎంసీల నీళ్లను నష్టపోయాయి. ఎగువనున్న అప్పర్ భద్రకు, దిగువనున్న పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన మోడీ సర్కారు, పాలమూరు ప్రాజెక్టుకు హోదా అడిగితే మొండిచేయి చూపిస్తున్నది. డిండి, శివన్నగూడెం, కిష్టరాయిపల్లి సహా మునుగోడును సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా కేంద్రం పైస సాయం చేయలేదు. పైగా, కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నది బీజేపీ.