హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల నిబంధనలను మార్పుచేసే అంశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిశీలిస్తున్నది. అదనంగా మరికొన్ని సబ్జెక్టులను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి.. జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఇతర నిపుణులతో కలిసి హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సమావేశంలో ఏఐసీఈటీ.. గైడ్లైన్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సెస్’ పేరిట జారీ చేసిన మార్గదర్శకాల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇంటర్లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదవాలన్న నిబంధన ఉన్నది. అయితే, కెమిస్ట్రీకి బదులుగా ఎలక్ట్రానిక్స్, బాటనీ, కంప్యూటర్ సైన్స్ వంటి 14 సబ్జెక్టులు చదివిన వారు కూడా ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని ఏఐసీటీఈ సూచించింది. దీనిపై నిర్ణయానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నది.
ఉదాహరణ ఇలా..
ఇంటర్లో గణితం, ఫిజిక్స్తోపాటు కెమిస్ట్రీకి బదులుగా కంప్యూటర్సైన్స్ తీసుకొన్న విద్యార్థి కూడా ఎంసెట్ రాయొచ్చు.
అధ్యయనానికి త్రిసభ్యకమిటీ
ఏఐసీటీఈ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేసే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ నివేదిక అందగానే ఓ నిర్ణయం తీసుకొంటామని చైర్మన్ లింబాద్రి తెలిపారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వారికే..
ఈ నిబంధనల అమలుతో రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డుల విద్యార్థులకు ఎంసెట్ రాసే చాన్స్ వస్తుంది. ఇంటర్బోర్డు నిర్వహిస్తున్న కోర్సుల్లో ఈ 14 సబ్జెక్టులను చేర్చలేదు. వీరికి ఇబ్బంది లేకపోగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థుల సమస్యలు తీరనున్నాయి.