Telangana | హైదరాబాద్ : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎఫ్) ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కొనసాగుతున్న ఎంపీహెచ్ఏ(ఎఫ్) రిక్రూట్మెంట్కు సంబంధించి మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆసుపత్రులు/సంస్థలు/ ఆరోగ్య కార్యక్రమాల్లో పనులు చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత అవకాశాలు పెంచేలా ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలకు పెంచింది.
ఇంతకుముందు రాత పరీక్షకు 80 పాయింట్లు, సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజి ఉండగా, ఇప్పుడు రాత పరీక్షకు 70 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు గాను గరిష్టంగా 30 పాయింట్లు నిర్దేశించింది. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
ఎంహెచ్ఎస్ఆర్డీ ద్వారా ఇప్పటికే 1520 హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తాజాగా మరో 146 పోస్టులను గుర్తించింది. దీంతో ఆ పోస్టులను కూడా ప్రస్తుతం భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 1666 హెల్త్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 265 పోస్టులను కూడా తాజా నోటిఫికేషన్లో జతచేసింది. మొత్తంగా ఎంహెచ్ఎస్ఆర్డీ ద్వారా 1931 పోస్టులను భర్తీ చేయనుండడం విశేషం.