హైదరాబాద్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ) : హజ్యాత్ర 2024 నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని రాష్ర్టాలకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 300 మంది యాత్రికులకు ఒక సహాయకుడిని ఎంపిక చేయగా, ప్రస్తుతం 200 మందికి ఒకరిని నియమించనున్నట్టు మైనార్టీ సంక్షేమశాఖ వెల్లడించింది. హజ్యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 7790 మంది వెళ్లనుండగా, ఇప్పటికే 25 మందికిపైగా సహాయక అధికారులను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా మరో 8 మందిని నియమించాల్సి ఉంది. ఇప్పటికే వెయింటింగ్ జాబితాలో ఉన్న 119 మందిలో నుంచి వీరిని ఎంపిక చేయనున్నట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో షేక్ లియాకత్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.