హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఓ తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఇంధన సామర్థ్య రంగంలో సుదీర్ఘ అనుభమున్న అస్పరి చంద్రశేఖరరెడ్డికి కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సంస్థ ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. దక్షిణాది రాష్ర్టాలకు ఆయనను బీఈఈ మీడియా సలహాదారుగా నియమించింది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన ‘లైఫ్ మిషన్’కు నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ మేరకు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలకు సలహాలు, సూచనలివ్వడం ఆయన విధిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి పనిచేస్తూ ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాల్సి ఉన్నది. దీంతోపాటు ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన ‘లైఫ్ మిషన్’కు నోడల్ అధికారిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంధన సామర్థ్యం, సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే ఇంధన సంరక్షణ, పొదుపుకు సంబంధించి బీఈఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని డీజీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చంద్రశేఖరరెడ్డి మూడు దశాబ్దాల వృత్తిపర జీవితంలో చిత్తశుద్ధికి, అంకితభావానికి దకిన గుర్తింపుగా ఇంధనరంగ అధికారులు అభివర్ణిస్తున్నారు.
జర్నలిస్టుగా మొదలైన జీవితం
అస్పరి చంద్రశేఖర్రెడ్డి స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పెద్దపుదిళ్ల గ్రామం. 1988లో జర్నలిజంలో కెరీర్ను ప్రారంభించారు. వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో 1992 వరకు విధులు నిర్వర్తించారు. 1992 నుంచి 1994 వరకు అప్పటి సీఎం కోట్ల విజయభాసరరెడ్డి ప్రత్యేక పీఆర్వోగా, 2005 లో సీఎం వైఎస్సార్కు సీపీఆర్వోగా, 2006 నుంచి 2011 వరకు సీఎం ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవోగా బాధ్యతలు చేపట్టి, ఇంధన సంరక్షణలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో కీలకపాత్ర పోషించారు.
ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్’ (ఈఈఎస్ఎల్) కొన్నినెలల క్రితం దక్షిణ భారతదేశం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపారాభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమించింది. ఈ క్రమంలోనే మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఈఈ దక్షిణాది మీడియా సలహాదారుగా ఆయనకు అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా అనేకమంది ఇంధనరంగ నిపుణులు ఈ పదవికి పోటీపడినా చివరికి చంద్రశేఖరరెడ్డినే అది వరించడం విశేషం.