హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు అలర్జీతో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. జైలు అధికారుల సమాచారం మేరకు వైద్య బృందం జైలులో చంద్రబాబును పరీక్షించింది. చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారని జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్ తెలిపారు. వైద్యులు సూచించిన మందులను అందిస్తామని వెల్లడించారు.
చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరుపర్చండి : ఏసీబీ కోర్టు
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది.