హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. వరుసగా రెండోరోజు శుక్రవారం ఈ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, 2021కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు. ఫైబర్నెట్ కేసులో కూడా 17ఏ చట్టం వర్తిస్తుందని వాదించారు. ఆ వాదనలను సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ తప్పుపట్టారు. విచారణ 17కు వాయిదాపడింది.
అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్
అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉన్నారు. బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారమే వాదనలు జరిగాయి. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచి శుక్రవారం వెలువరించింది. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ..విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పటికే రెండు పర్యాయాలు కొంతమందికి బెయిల్ మంజూరు చేసింది. కాగా, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.