చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి), ఏప్రిల్ 2: ‘చల్లగరిగె’ స్ఫూర్తితోనే ప్రపంచ గడ్డమీద ‘నాటు నాటు’ తెలుగు పాట నిలిచి గెలిచిందని సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె స్వగ్రామానికి వచ్చిన ఆయనకు పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. తెలుగు సినీ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు.. నాటు’ పాటకు గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు పొందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కలిసి నిర్వహించిన అభినందన సభకు చంద్రబోస్ దంపతులు హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన చంద్రబోస్ ముందుగా తన తల్లి దివంగత మదనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబోస్ సతీమణి సుచిత్రతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. పూర్వవిద్యార్థులు, మిత్రు లు, స్థానిక ప్రజాప్రతినిధులు వారిని సన్మానించారు.
చంద్రబోస్ మాట్లాడుతూ.. నాటు.. నాటు పాట ఈ ప్రాంతం పరిసరాల నుంచే పుట్టిందని తెలిపారు. ‘పొలం గట్టు.. పోట్ల గిత్తె.. పోలేరమ్మ.. పోతరాజు.. కిర్రు చెప్పులు.. బుర్ర మీసాలు.. మర్రి చెట్టు.. ఎర్రజొన్న రొట్టె.. మిరపతొక్కు’ వంటి పదాలు తనను ప్రేరేపించాయని చెప్పారు. ఈ గ్రామ వాసిగా ప్రపంచ గడ్డ మీద తాను పొందిన ఆస్కార్ అవార్డే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చల్లగరిగె గ్రామంలోని లైబ్రరీని పూర్తి వసతులతో పునర్నిర్మిస్త్తానని, దానికి ‘ఆస్కార్ గ్రంథాలయం’ పేరు నామకరణం చేస్తానని వెల్లడించారు. పాఠశాలలో సమావేశ హాలు, గేటు నిర్మాణానికి సహకారం అందిస్తానని చెప్పారు. పక్క గ్రామాల్లోని పేద విద్యార్థులకు తమ వంతుగా స్కాలర్షిప్లను అందజేస్తానని హామీ ఇచ్చారు.