హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఒక్కసారి చేరితే.. అదే కాలేజీలో డిగ్రీ.. పీజీ పూర్తిచేయొచ్చు. కష్టపడి ఐదేండ్లు చదివితే.. డిగ్రీతో పాటు, పీజీ పట్టాను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశం కల్పిస్తున్నదే ఇంటిగ్రేటెడ్ పీజీ. ఈ కోర్సుల పట్ల ఇటీవలి కాలంలో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)లోనే గణనీయంగానే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎయిమ్స్, ఐసర్, బిట్స్ పిలానీ, ఐఐటీలు, సెంట్రల్ వర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అమలుచేస్తున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. సీపీగెట్ ద్వారా సీట్లను భర్తీచేస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసిన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చు.