హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి ఏదైనా కోర్సును స్వదేశంలో లేదంటే విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ, ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకొనే అవకాశాన్ని హైదరాబాద్లోని జేఎన్టీయూ కల్పిస్తున్నది. విద్యార్థులు ఒకేసారి బీటెక్, ఎంటెక్ రెండు కోర్సులను పూర్తిచేసుకోవచ్చు. బీటెక్, ఎంటెక్ కోర్సుల నిర్వహణకు జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్లు ఇటీవలే అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లారెన్స్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఎంఎస్వోయూ, అలబామా యూనివర్సిటీ, స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన దగ్గర ఎంసెట్, పీజీఈసెట్, గేట్ ర్యాంకుల ద్వారా బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విధానంలో ఎంసెట్ ద్వారా బీటెక్లో ప్రవేశాలు పొందిన వారు పీజీఈసెట్, గేట్లతో సంబంధం లేకుండా ఎంటెక్లో అడ్మిషన్లు పొందవచ్చు.
ఐదేండ్లలో బీటెక్, ఎంటెక్..
మన దగ్గర బీటెక్ నాలుగేండ్లు, ఎంటెక్ రెండేండ్లు పడుతున్నది. కానీ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో భాగంగా బీటెక్, ఎంటెక్ కోర్సులను ఐదేండ్లలోనే పూర్తిచేయొచ్చు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సులను జేఎన్టీయూ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ కోర్సుల్లో చేరిన వారు మొదటి మూడేండ్లు బీటెక్ డిగ్రీని జేఎన్టీయూలో, బీటెక్ చివరి సంవత్సరాన్ని అమెరికాలో, ఎంటెక్ను కూడా అమెరికాలోనే చదివే అవకాశం కల్పిస్తారు.
ఇప్పటికే రెండు వర్సిటీల్లో..
ఇప్పటికే జేఎన్టీయూ.. ఆమెరికాలోని రెండు యూనివర్సిటీల భాగస్వామ్యంతో డ్యూయల్ డిగ్రీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో ఎంబీఏ, స్వీడన్లోని బ్లికింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్) సహకారంతో ఐదేండ్ల మాస్టర్స్ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నారు.