హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సుల విద్యార్థులకు మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశం కల్పించాలని సాంకేతిక విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పాలిటెక్నిక్ను మధ్యలో వదిలేసిన వారికి ఇంటర్తో సమాన సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి కోరుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్కు ప్రతిపాదనలు పంపించారు. ఆయన ఆమోదిస్తే విద్యార్థులకు ఈ వెసులుబాటు లభించనున్నది. పదో తరగతి తర్వాత కొంతమంది విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్నారు. కానీ సబ్జెక్టులు కఠినంగా ఉండటం, ఇతర కారణాలతో గట్టెక్కలేకపోతుంటారు. దీంతో ఈ కోర్సుల్లో ఫెయిలయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. నిర్దిష్ట క్రెడిట్స్ సాధించలేక.. పలుమార్లు పరీక్షలు రాసినా పాస్ కాలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చదివిన చదువులు విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. పైగా సమయం వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇంటర్తో సమానమైన సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన మేరకు ఇంటర్బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. దీనిపై నవీన్ మిట్టల్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదివరకు పాలిటెక్నిక్లో చేరితే మూడేండ్లు పూర్తిచేయాల్సిందే. ఇలా చేస్తేనే కోర్సు పూర్తయినట్టు లెక్క. మధ్యలో వదిలేస్తే డిస్కంటిన్యూ అయినట్టే. కానీ, ఎగ్జిట్ విధానం అమలులో భాగంగా ఈ విద్యాసంవత్సరం సెకండియర్ పూర్తిచేసిన వారికి డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. తాజాగా పాలిటెక్నిక్ ఫస్టియర్లో ఎగ్జిట్ అయిన వారికి ఇంటర్ సెకండియర్లో ప్రవేశం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నది.
అమలుతీరు ఇలా..
పాలిటెక్నిక్ ఫస్టియర్ పూర్తిచేసి కోర్సును వదిలేసినా.. నిర్దిష్ట క్రెడిట్స్ను సాధించినా ఆయా విద్యార్థికి ఇంటర్ ఫస్టియర్తో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో ఇంటర్ సెకండియర్లో చేరవచ్చు.
పాలిటెక్నిక్ సెకండియర్ పూర్తిచేసి మధ్యలో నిష్క్రమించినా.. మూడేండ్ల కోర్సులో ఫెయిలై నిర్దిష్ట క్రెడిట్స్ 90 సాధిస్తే ఆ విద్యార్థికి సర్టిఫికెట్ ఇన్ ఇంజినీరింగ్ను ఈ విద్యాసంవత్సరం నుంచి జారీచేస్తున్నారు. వీరు బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
ప్రస్తుతానికి 150 క్రెడిట్స్కుగాను 130 క్రెడిట్స్ సాధిస్తే పాలిటెక్నిక్ పూర్తిచేసినట్టు లెక్క. ఇలాంటి వారికి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ను అందజేస్తున్నారు.