Chakali Ilamma | హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరుగున పడిన తెలంగాణ వైతాళికులు, పోరాటయోధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం లభిస్తున్నది. ఇప్పటికే అనేక మంది కవులు, పోరాట యోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తాజాగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మకు స్వరాష్ట్రంలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 10న ఐలమ్మ వర్ధంతిని, 26వ తేదీన జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం రజక ఫెడరేషన్కు సూచించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై రజక సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో ఏవిధమైన గుర్తింపునకు నోచుకోని ఎందరో పోరాట యోధులను, వీరయోధులను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తున్నదని రజకసంఘాల నేతలు కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ కొండూరు సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.