రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాజకీయాలతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ(సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టంచేశారు. శనివారం సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. పాలకవర్గం పారదర్శకంగా సేవలందిస్తుంటే కొందరు కావాలని సెస్ సంస్థపై అవినీతి బురదజల్లడం సరికాదన్నారు. ఎన్పీడీసీఎల్కు సెస్ రూ.545 కోట్లు బకాయిలు నిజమేనని తెలిపారు. బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న సెస్ను.. ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఈఆర్సీ సూచన చేసిందని తెలిపారు.
బకాయిలున్నట్టు చెప్పిన ఈఆర్సీ.. ప్రభుత్వం నుంచి సెస్కు రావాల్సిన రూ.600 కోట్ల విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 2022 జూలైలో రూ.11 కోట్లున్న విద్యుత్తు డిమాండ్ను రూ.19 కోట్లకు పెంచినట్టు వివరించారు. ప్రస్తుతం విద్యుత్తు చార్జీలు పెంచిందని, రూ.4.85 పైసలకు యూనిట్ కొంటున్న సెస్, రూ.6.5 పైసలకు విక్రయించాల్సి ఉందని చెప్పారు. సంస్థలో అవినీతికి పాల్పడ్డ 13 మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. సిరిసిల్ల మరమగ్గాల ఎస్ఎస్ఐ యూనిట్లు రూ.22 కోట్ల బకాయిలున్నాయని, వాటితోపాటు వినియోగదారులందరూ సకాలంలో విద్యుత్తు బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 2.98 లక్షల వినియోగదారులున్న సెస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.