సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. సిద్దిపేటలోని శివానుభవ మండపంలో జరుగుతున్న సీపీఐ 3వ జిల్లా మహాసభలకు బుధవారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీకి స్థానం ఉండదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నినాదాలకే సరిపోయిందని, పథకాల అమలులో ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా.. దేశంలో పేదరికం అలాగే ఉన్నదన్నారు. ఉచిత పథకాలు వద్దంటున్న మోదీ.. సంక్షేమ పథకాలను, సబ్సిడీలను పేద ప్రజల నుంచి దూరం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు.