వేములవాడ, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరిస్తూ మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం ప్రారంభించగా ఆయన హాజరై మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విభజనను మరోసారి వక్రీకరించి మాట్లాడడం సరికాదని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ రాష్ట్రమని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఆవేశానికి కేరాఫ్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావుల పై ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి కూడా తెలంగాణలో అడుగుపెట్టేందుకు చూస్తుందని ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అర్థం చేసుకోవచ్చు అని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బేశరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలో సామాజిక న్యాయం పూర్తిగా కొరబడిందని మండిపడ్డారు.
ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా గెలవాలనే దానిపైన దృష్టి ఉంది కానీ రాజ్యాంగంలోని ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, నీడ, విద్య, వైద్యం విధానంలో ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. దేశంలోని సంపద నలుగురు దగ్గరే మూలుగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల సిపిఐ జిల్లా కార్యదర్శిలు సుదర్శన్, శ్రీనివాస్, సదానందం, విశ్వనాథం, రాష్ట్ర నాయకులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, శంకర్, నాయకులు వేణు, రాములు తదితరులు ఉన్నారు.