హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ), డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డు (డీసీడబ్ల్యూబీ) చైర్మన్, సభ్యులు, సోషల్ వర్కర్ల ఎంపికలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసి గుట్టుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అభ్యర్థులకు ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. వారం తర్వాత ఫలితాలు వెల్లడించింది. దీంతో అధికారులు 15 రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 36 బోర్డులకు సంబంధించి 1:3 నిష్పత్తిలో 756 మంది అభ్యర్థులతో షార్ట్లిస్ట్ను విడుదల చేశారు. కానీ, మెరిట్ లిస్టును వెలువరించకుండానే శనివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 19 నుంచి జూన్ 5 వరకు ఈ పక్రియ కొనసాగుతుందని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులకు 15 రోజుల్లోగా ఇంటర్వ్యూలు నిర్వహించి డీసీడబ్ల్యూబీ చైర్మన్, నలుగురు సభ్యులతోపాటు జేజేబీలో ఇద్దరు సోషల్ వర్కర్లను ఎంపిక చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్తున్నారు.
మెరిట్ లిస్టు విడుదల చేయకుండానే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టడంపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కులను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పారదర్శకంగా చైర్మన్, సభ్యులను ఎంపిక చేస్తామని చెప్పిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. అవతకలకు పాల్పడేందుకే మార్కుల వివరాలను వెల్లడించడంలేదని, ఆ పోస్టులను అధికార పార్టీ నేతల అనుచరులకు కట్టబెట్టేందుకే గుట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత డీసీడబ్ల్యూబీ చైర్మన్, సభ్యుల నియామకాలు చేపడుతుండటంతో ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆ పోస్టుల కోసం జోరుగా పైరవీలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు విధేయులైన కొందరు అభ్యర్థులు మంత్రులు, కీలకనేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మాత్రం పైరవీలకు తావులేదని, పారదర్శకంగా చైర్మన్, సభ్యులను ఎంపిక చేస్తామని, అభ్యర్థులు అనవసరంగా ఆందోళనకు గురికావద్దని, పుకార్లను నమ్మవద్దని చెప్తున్నారు.