కాచిగూడ, మార్చి 30: బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కులగణన చేయాలని విద్య, ఉద్యోగ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన వేల మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.