హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సౌర విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానళ్లపై సబ్సిడీని కుదించడంతోపాటు వాటిపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 5 నుంచి 12 శాతానికి, దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచింది. ఇవి ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న అరకొర సబ్సిడీని కూడా దేశీయంగా తయారైన సోలార్ ప్యానళ్లను వాడితేనే ఇస్తామంటూ మోదీ సర్కార్ షరతు విధించింది.
తద్వారా ఎవరూ సౌర విద్యుత్తు జోలికి వెళ్లకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. వాస్తవానికి దేశంలో తయారయ్యే సోలార్ ప్యానళ్ల కంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సోలార్ ప్యానెళ్ల ధరలు చాలా తక్కువ. కానీ, మోదీ సర్కారు తీరు వల్ల దేశంలోని సౌర విద్యుత్తు ఉత్పత్తిదారులతోపాటు వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో సోలార్ ప్యానళ్లకు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ వాటి తయారీ అంతంత మాత్రంగానే ఉన్నది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు తయారీ కంపెనీలు సోలార్ ప్యానళ్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో 2 కిలోవాట్ల సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకునే వినియోగదారుడిపై అదనంగా రూ.17,134 భారం పడనున్నది. 3 కిలోవాట్ల యూనిట్ను ఏర్పాటు చేసుకునేవారికి ఈ భారం రూ.34,126గా, అధిక సామర్థ్య యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు 40 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి దరఖాస్తు చేసుకున్నాయి. మోదీ సర్కార్ తీరు వల్ల ఈ కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించి సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ సంఘాలకు శరాఘాతంగా మారింది.
కేంద్రం చెప్పేది ఒకటి చేసేది మరొకటి
కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి. దేశ అవసరాలను తీర్చడంతోపాటు విదేశాలకు సైతం విద్యుత్తును ఎగుమతి చేస్తామని కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, సమీప భవిష్యత్తులో అది జరిగేలా కనిపించడం లేదు. దేశ అవసరాలనే సరిగా తీర్చలేకపోతున్న మోదీ సర్కారు.. విదేశాలకు విద్యుత్తును ఎగుమతిచేసే పరిస్థితి లేనేలేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ అన్ని ఇండ్లకు కరెంటు సరఫరా చేయలేకపోతున్నాం. అయినా మోదీ సర్కారు ప్రత్యక్షంగా, పరోక్షంగా సోలార్ ప్యానళ్ల ధరలు, పన్నులను భారీగా పెంచింది. వాటిపై కొత్తగా దిగుమతి సుంకాన్ని విధించి సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యయాన్ని పెంచింది. దీంతో పలు కంపెనీలు సౌర విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశాయి. సోలార్ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నాయి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోని కేంద్రం.. అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఏఎల్ఎల్ఎంయూ) అనే కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఇది కూడా ప్రజలకు నష్టదాయకమే.
– వై సతీశ్రెడ్డి, రెడ్కో చైర్మన్