16న ఢిల్లీ సమావేశంలోనైనా తేలేనా?
6 ఎయిర్పోర్టులకు రాష్ట్రం ప్రతిపాదన
కేంద్రం కాలయాపన.. అడ్డంకులు
స్వయంగా సీఎం కోరినా స్పందన లేదు
చెన్నైలో రెండో ఎయిర్పోర్టుకు మాత్రం కేంద్రం గ్రీన్సిగ్నల్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తున్నది. విమానయానాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు చేరువ చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తున్నది. ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఆదిలాబాద్, వరంగల్ (మామునూరు), పెద్దపల్లి(బసంత్నగర్), నిజామాబాద్(జక్రాన్పల్లి), భద్రాద్రి కొత్తగూడెం(పాల్వంచ), మహబూబ్నగర్(దేవరకద్ర) జిల్లాలు అనుకూలమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నివేదిక ఇచ్చి మూడున్నరేండ్లు దాటింది. అయినప్పటికీ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపకుండా కేంద్రం తాత్సారం ప్రదర్శిస్తున్నది. కానీ చెన్నైలో రూ.40 వేల కోట్లతో రెండో అతిపెద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా విమానాశ్రయాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు.. అయినప్పటికీ మార్పులేదు. ఎయిపోర్టుల ఏర్పాటుపై 16న ఢిల్లీలో నిర్వహించే అత్యున్నత స్థాయి సమావేశంలోనైనా తెలంగాణ ఎయిర్పోర్టుల ఏర్పాటుపై కేంద్రం స్పందిస్తుందా? లేదా అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తుందా? అనేది తేలిపోనున్నది.
రన్వేలు ఉన్నా.. తాత్సారం ఎందుకు?
ఆదిలాబాద్, నిజామాబాద్(జక్రాన్పల్లి), వరంగల్(మామునూరు)లో ఇప్పటికే రన్వేలు సిద్ధంగా ఉన్నాయి. అకడ త్వరగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయవచ్చని ఏఏఐ అధికారులు సైతం తెలిపారు. 2019లో హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4.5 కోట్లు వెచ్చించి డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ మూడు ప్రాంతాల్లో రన్వేల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకయ్యే అంచనా వ్యయంతో తుది నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. తొలిదశలో చిన్న విమానాలు నడిపేందుకు చేపట్టాల్సిన చర్యలు, అందుకయ్యే ఖర్చును నివేదించాలని విన్నవించింది. కానీ.. అటు ఎయిర్పోర్టు అథారిటీ కానీ, ఇటు కేంద్రంలోని మోదీ సర్కారు కానీ దీనిపై స్పందించలేదు. తెలంగాణలో ఐటీ, పారిశ్రామిక రంగాలు అతివేగంగా విస్తరిస్తున్నాయి. ద్వితీయశ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అందులో భాగంగానే ఆరు ఎయిర్పోర్టుల నిర్మాణానికి రాష్ట్రం ప్రణాళిక సిద్ధం చేసింది.