హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల 20 నుంచి తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మండే ఎండలను దృష్టిలో ఉంచుకొని జూన్ మూడుకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. పది రోజుల్లోగా ప్రతి వైకుంఠధామానికి మిషన్ భగీరథ నీళ్లు అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై సీఎం సమీక్షించారు. ‘పంచాయతీరాజ్లో మూడంచెల విధానం వచ్చిన తర్వాత రాజీవ్గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ర్టాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నది.
జవహర్ రోజ్గార్ యోజన, ప్రధాన్మంత్రి గ్రామసడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానంకాదు. 75 ఏండ్ల అమృత మహోత్సవాల నేపథ్యంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లో మగ్గుతున్నాయి. తాగు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్రం ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా రాష్ర్టాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని సీఎం అన్నారు. దేశం ఒక సమగ్రమైన ఆకళింపు, అవగాహన, అభ్యుదయం వైపు అడుగులు వేస్తున్నట్టు అనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని నిరంతర కరెంటు, వ్యవసాయం సహా పలు సంక్షేమ పథకాలను పొరుగు రాష్ర్టాల ప్రజలు అందిపుచ్చుకొంటున్నారని సీఎం చెప్పారు.
పునర్నిర్మాణం సాహసోపేతం
విధ్వంసానంతరం వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం కష్టమైన పని అని కేసీఆర్ అన్నారు. 6 దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదని.. అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకొంటున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకొంటున్నామని.. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. ప్రతి పల్లెలో ఒక ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకొంటున్నామని చెప్పారు.
‘నేను గతంలో చెప్పినట్టు, ఎస్కే డే ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం. నేడు అందులో రాజకీయాలు ప్రవేశించడంతో ఆ స్ఫూర్తి చంపివేయబడ్డది. సహకార ఉద్యమమూ కలుషితమైపోయింది. ఈ నేపథ్యంలోంచి తెలంగాణ ఏర్పడ్డది. ప్రారంభ దశలో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్య క్రమాలు కొందరికి జోక్లాగా కనిపించాయి. నేను అటవీశాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష నిర్వహిస్తే కొందరు నవ్వుకొన్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధ వాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాళ దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణలో అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా చానళ్లు ప్రసారం చేయటాన్ని చూసి ఇతర రాష్ర్టాలవారు ఆశ్చర్యపోయారని తెలిపారు. ‘తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అంటే మనం అనతికాలంలో అనితరసాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
జడ్పీ చైర్మన్లు కీలకం
పంచాయతీరాజ్ వ్యవస్థపై గతంలో ప్రత్యేక గౌరవం ఉండేదని.. నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కోట్ల విజయ్భాస్కర్రెడ్డి, మాజీ మంత్రి బాగారెడ్డి లాంటి మహామహులు మంత్రులుగా కంటే జడ్పీ చైర్మన్లుగానే కొనసాగడానికి ఇష్టపడేవారని కేసీఆర్ గుర్తుచేశారు. పంచాయతీరాజ్లో జడ్పీ చైర్మన్ల పాత్ర కీలకమైందని తెలిపారు. ప్రస్తుత జడ్పీ చైర్మన్లు పల్లె ప్రగతి కార్యక్రమంలో కీలక భూమిక పోషించాలన్నారు. ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలనూ వినియోగించుకోవాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితి దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పనుల పురోగతిని ఆకస్మిక తనిఖీలు చేసి పర్యవేక్షించాలన్నారు. అన్ని పంచాయతీల్లో వైకుంఠధామం పనులు వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు జరుగని చోట అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించాలన్నారు. ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) విషయంలో వందశాతం ఫలితాలను రాబట్టడానికి 15 రోజుల్లో నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. నిజమైన స్ఫూర్తి, లక్ష్యంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందన్నారు. అడవులు, తాగు, సాగునీరు, ఆరోగ్యం, మన ఊరు – మన బడి, దళితబంధు వంటి పలు రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి దిశగా సాగుతున్నదని చెప్పారు. భవిష్యత్తు తరాలు సుఖంగా ఉండాలంటే మనం ప్రత్యేక శ్రద్ధ వహించి, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ప్రజారోగ్యంలో పురోగతి
రాష్ట్రంలో 10 వేల పడకల సామర్థ్యంతో 6 మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించుకొంటున్నామని సీఎం తెలిపారు. వరంగల్లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా 2,000 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ దవాఖానలను కడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి 57 వేల ఆక్సిజన్ బెడ్స్ కలిగిన సామర్థ్యం తెలంగాణ వైద్యరంగంలో ఏర్పడిందన్నారు. 550 టన్నుల ఆక్సిజన్ ఇకడే ఉత్పత్తి సామర్థ్యం కలిగిందని పేర్కొన్నారు. కరోనా లాంటి విపతర పరిస్థితులను ఎదురొనే శక్తి తెలంగాణకు ఉన్నదన్నారు.
గ్రీన్ఫండ్ను పరిచయం చేసింది మనమే
గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్ను ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది తెలంగాణే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వేతనంలో వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు ప్రతి నెలా కంట్రిబ్యూట్ చేసే విధానం తెచ్చామని తెలిపారు. అడ్మిషన్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల్లోనూ గ్రీన్ఫండ్ వసూలు చేస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల్లో 10% హరితహారానికి కేటాయించేలా చట్టం చేశామని తెలిపారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను మంత్రులు, చీఫ్ సెక్రటరీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, లోకల్బాడీ కలెక్టర్లు, డీపీవోలు, నిరంతరం తనిఖీలు చేసి, ఎవరి పరిధిలో వారు రెగ్యులర్గా సమీక్ష జరపాలని ఆదేశించారు. మహబూబ్నగర్లో 2,087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లో అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్కు ఓఆర్ఆర్ గ్రీన్ నెక్లెస్ లాంటిదని.. దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం విషయంలో జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, మల్టీలేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింప చేయడం ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్లీ తెచ్చుకొందామని పిలుపునిచ్చారు.
వైకుంఠధామాలకు 10 రోజుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామానికి మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్లను 10 రోజుల్లోగా అందించాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ, ఏఎన్ఎం తదితర ప్రజావినియోగ సంస్థల పరిశుభ్రత, తాగు నీటి వసతి బాధ్యతలు గ్రామ పంచాయతీలు నిర్వహించేలా డీపీవోలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెరువులు, వాగులు, వర్రెలు, వంకలు, నదులు, ఉపనదీ తీరాల వెంట గ్రీన్ కవర్ అవకాశం ఉన్న ప్రతి చోట మొకలు నాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల విషయంలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరక్టర్లకు సీఎం సూచించారు. మంత్రులు జిల్లాల్లో, మున్సిపాలిటీలలో చైర్మన్లు, మేయర్లు, కమిషనర్ల తో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం చెప్పారు.
దశలవారీగా దళితబంధు
ఈ ఏడాది నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపికచేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశలవారీగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని తెలిపారు. దళితబంధు అమలులో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో అధికారులు, పలువురు సలహాదారులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పంచాయతీ రాజ్, వ్యవసాయశాఖల కార్యదర్శులు అటవీశాఖ అధికారులు, సంబంధితశాఖల కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, రైతు సమన్వయ సమితి చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొంటాం
అకాల వర్షాల వల్ల తడిసిన వరి ధాన్యాన్ని కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. వానకాలం సమీపిస్తుండటంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలన్నారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర ప్రక్రియల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 20 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎంకు వివరించారు. అకాల వర్షాల వల్ల అకడకడ వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్ను ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వమే కొంటుందని పునరుద్ఘాటించారు.
పల్లె, పట్టణ ప్రగతి జూన్ 3కు వాయిదా
వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలన్న సమావేశం కోరికను సీఎం మన్నించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలని పేర్కొన్నారు. ఈ ప్రసంగాలను జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారు చేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో కార్యక్రమాలను ఉదయం 9కి ప్రారంభించి త్వరగా ముగించాలని తెలిపారు. సాయంత్రంపూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ రవీంద్రభారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను రాయాలని కవులను ఆహ్వానించాలని ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ పబ్లిక్గార్డెన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలన్నారు.
తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడేలా ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణం’ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామాలు, 5 వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘గ్రామీణ క్రీడా కమిటీల’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడల నిర్వహణకు ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవంనాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని ఆదేశించారు.