హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కులగణనపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వక్రీకరించవద్దని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. జనగణనలో కులగణన నిర్వహించవద్దని కోరుతూ ఇటీవల ఒకరు రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలా? వద్దా? అనేది కేంద్ర ప్రభుత్వ శాసనపరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని, అంటే తుది నిర్ణయం కేంద్రానిదేనని వెల్లడించిందని పేర్కొన్నారు.
అయితే కొందరు వాస్తవ విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. తమ సర్వే వల్లేనని కొన్ని రాజకీయపార్టీలు, బీసీ సంఘాలు సైతం ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కులసర్వేను ప్రశంసించినట్టుగా చెప్పుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం నిర్వహించే ‘సెన్సస్’ ఒక్కటే అధికారికమని, రాజ్యాంగబద్ధత ఉంటుందని, రాష్ర్టాలు నిర్వహించే సర్వేలకు సెన్సస్తో సమానంగా పరిగణించడం సరికాదని తెలిపారు. కుల సర్వే వెనుక అనేక బీసీ సంఘాల దీర్ఘకాల పోరాటం, సామాజిక చైతన్యం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.