హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పంటల సాగులో యూరియాతోపాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కేంద్రం అన్ని రాష్ర్టాలతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఏయే రాష్ట్రం ఎంతమేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించిందో, ఇకపై ఎంత తగ్గిస్తారనే అంశాలను తెలుసుకున్నది. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం-ప్రణామ్’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయశాఖ రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పచ్చిరొట్ట, కంపోస్ట్ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నది.
పీఎం ప్రణామ్పై ఇప్పటికే అనేక విమర్శలున్నా యి. ఏటా పెరుగుతున్న ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే సాకుతో ఎరువుల పంపిణీలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా సాగు పెరుగుతుండటంతో రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతున్నది. దీంతో కేంద్రంపై ఎరువుల సబ్సిడీ భారం భారీగా పెరుగుతున్నది. గత ఏడాది ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.05 లక్షల కోట్లు కేటాయించగా, రూ. 2.25 లక్షల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఆర్థిక భారా న్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే పీఎం ప్రణామ్ను తెరపైకి తీసుకొచ్చిందనే వాదనలు ఉన్నాయి.
పీఎం ప్రణామ్ పథకం అమలు ద్వారా క్రమంగా ఎరువుల పంపిణీలో కోత పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు పరోక్షంగా సంకేతాలిచ్చింది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే రాష్ర్టాలకు తగ్గించిన ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని ఆశ చూపింది. పీఎం ప్రణామ్ పథకం తెలంగాణ వ్యవసాయరంగంపై, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో ఎరువుల వినియోగం కాస్త ఎక్కుగానే ఉంటుంది. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే యూరియాతోపాటు ఇతర ఎరువుల వినియోగం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే కేంద్ర నిర్ణయం రాష్ట్ర వ్యవసాయ రంగానికి అశనపాతంగా మారుతుందనే రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.