హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గత ఏడాది జూలై 15న జారీచేసిన నోటిఫికేషన్ను రద్దుచేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ప్రతినిధి డీ పాండురంగారెడ్డి, మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. పిల్ విచారణార్హతపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిల్ తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై కాదని, పిల్కు హైకోర్టు రిజిస్ట్రీ నంబర్ కేటాయించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి పిల్ రాదన్నారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉన్నదని తెలిపారు.
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేశామని, హైకోర్టుకు ఈ పిల్ను విచారించే అర్హత ఉన్నదని చెప్పారు. తెలంగాణ, ఏపీల్లోని భారీ, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను తన గుప్పిట్లోకి తీసుకొనేలా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నదని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిషరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను గుంజుకుంటున్నదని చెప్పారు. పిల్లుల మధ్య తలెత్తిన రొట్టె పంపక వివాదంలో తీర్పు చెప్పాల్సిన కోతి మొత్తం రొట్టెను ఆరగించిన సామెత మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నదని తెలిపారు. రెండు రివర్ బోర్డులకు రెండు తెలుగు రాష్ట్రాలు ఒకొకటి రూ. 200 కోట్లు చొప్పున మొత్తం రూ.400 కోట్లు చెల్లించాలని, ఇది ఏప్రాతిపదికపై నిర్ణయించిందీ కేంద్రం వెల్లడించలేదని తెలిపారు. కేంద్రం పెత్తనం చేసేలా ఉన్న సదరు నోటిఫికేషన్ను రద్దు చేసి రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలని కోరారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కేంద్ర జలశక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.
17 టీఎంసీలు విడుదల చేయండి
కేఆర్ఎంబీకి తెలంగాణ ఇండెంట్
వానకాలం సాగుకు సంబంధించి ఆగస్టు నెలకు 17 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ సర్కారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇండెంట్ పంపించింది. నాగార్జునసాగర్ నుంచి 12 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు విడుదల చేయాలని ప్రతిపాదించింది. ఏపీ సైతం రెండు ప్రాజెక్టుల నుంచి కలిపి 33 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పంపింది. త్వరలోనే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి వీటిపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ యోచిస్తున్నది. ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మొత్తం వానకాలం సీజన్కు నీటిని విడుదల చేయాలని చూస్తున్నది.