PM Pranam | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ సినిమా చూపించిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఎరువులపై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తేసే కుట్రకు తెగబడుతున్నది. యాసంగి పంట సీజన్కు (అక్టోబర్ 1, 2023-మార్చి 31, 2024) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి ఎరువులకు సంబంధించిన సబ్సిడీ రేట్లను (ఎన్బీఎస్) బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సబ్సిడీ కింద రూ. 22,303 కోట్ల విడుదలకు ఆమోదముద్ర వేసింది. రైతులకు సులభంగా, అందుబాటు ధరల్లో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదంటూ ఎప్పటిలాగే సవతి తల్లి ప్రేమను కురిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారాన్ని రైతులపై మోపట్లేదని, ఎరువుల ధరలు ఎంతమాత్రం పెంచట్లేదని పనిలో పనిగా మొసలి కన్నీరు కార్చింది.
నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి ఎరువులకు గతంలో ఇస్తున్న సబ్సిడీ కేటాయింపులతో పోలిస్తే, ఈసారి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఎంతలా అంటే, గత యాసంగి పంట సీజన్కు (అక్టోబర్ 1, 2022-మార్చి 31, 2023) సబ్సిడీ కింద రూ. 51,875 కోట్లను కేటాయిస్తే, ఈ సారి రూ. 22,303 కోట్లు (57 శాతం కోత) మాత్రమే కేటాయించారు. అంతేకాదు.. ఒకవైపు అంతర్జాతీయంగా ఈ ఎరువుల ధరలు తగ్గుతున్నప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెడుతున్న కేంద్రం.. ఎరువుల ధరలు పెరుగుతున్నట్టు అబద్ధాలకు దిగింది. అలా.. గ్లోబల్ మార్కెట్లలో తక్కువ ధరకు ఎరువులు లభిస్తున్నప్పటికీ, రేట్లను తగ్గించకుండా.. ఆ ఆర్థిక ప్రయోజనాలు అన్నదాతలకు అందకుండా ఖజానాకు మళ్లిస్తున్నది.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయరంగమే ఆయువుపట్టు. రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. కొన్నేండ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగటంతోపాటు, వాణిజ్య పంటల సాగు కూడా పెరగటంతో రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగింది. దానితోపాటే ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ పెంచాల్సిన అవసరమున్నది. కానీ, బీజేపీ సర్కారు ఆ విషయాన్ని వదిలేసి ఎరువుల సబ్సిడీ భారాన్ని వదిలించుకోవటం గురించే ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగానే, సేంద్రియ సాగును ప్రోత్సహించే ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే యాసంగి సీజన్ ఎరువులపై ఇచ్చే సబ్సిడీకి కేంద్రం 57% కోత విధించడం గమనార్హం.
ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై మొత్తంగా సబ్సిడీ రూ. 2.54 లక్షల కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం దీన్ని రూ. 1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్టు గత ఫిబ్రవరిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. అంతేకాదు, ఎరువులు దొరక్కపోవడంతో మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ర్టాల్లో లైన్లలోనే నిలబడి రైతన్నలు ప్రాణాలు విడిచిపెడుతుండటం దేశంలో ఎరువుల ‘కృత్రిమ’ కొరతకు తార్కాణాలు. భారత్లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాని ‘ప్రణామ్’ స్కీమ్ను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ విధంగా చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.