Palamuru- Rangareddy project | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించి కరువు నేలల దాహార్తిని తీర్చాలనే తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆ పనులకు ఒకవైపున ఏపీ, మరోవైపున కేంద్ర జలసంఘం అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాయి. పర్యావరణ అనుమతుల సాధనలో భాగంగా తెలంగాణ సర్కారు ఇటీవలనే డీపీఆర్లను కేంద్ర పర్యావరణ అటవీశాఖకు, కేంద్ర జలసంఘానికి, కేఆర్ఎంబీకి అందజేసింది. అంతే ఆ వెంటనే ఆయా శాఖలకు ఏపీ లేఖల మీద లేఖలు రాయటం మొదలుపెట్టింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని ఫిర్యాదు చేసింది. డీపీఆర్లను పరిశీలించవద్దని కేంద్రానికి, రివర్ బోర్డును కోరింది. తాజాగా పీఆర్ఎల్ఐఎస్కు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగా, దానిపైనా ఏపీ అభ్యంతరాలు మొదలు పెట్టింది. తెలంగాణ జీవోను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అక్కడితో ఆగకుండా ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనూ పిటిషన్ దాఖలు చేయటం ఏపీ కక్షపూరిత చర్యలకు నిదర్శనం.
వత్తాసు పలుకుతున్న సీడబ్ల్యూసీ
ఏపీ చర్యలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇతోధికంగా వత్తాసు పలుకుతూ, తెలంగాణ హక్కులకు గండి కొడుతున్నది. తీరని విద్రోహాన్ని తలపెడుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. వరదజలాల ఆధారంగా ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రాజెక్టుకు నికర జలాలను సాధించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తూ వస్తున్నారు. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ వేసి నదీ జలాలను పునఃపంపిణీ చేపట్టాలని స్వరాష్ట్ర ఏర్పాటు నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎనిమిదేండ్లు గడచినా ఇప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలను చేపట్టలేదు. అదీగాక నికరజలాలు ఉన్న ప్రాజెక్టులకే అనుమతులు ఇచ్చేలా కేంద్రం కొత్తగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను రూపొదించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు పీఆర్ఎల్ఐఎస్కు అనుమతులు సాధించాలనే లక్ష్యంతో నికరజలాలను కేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను గత సెప్టెంబర్ 13న కేంద్ర పర్యావరణశాఖకు సమర్పించింది. దీనిపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతున్నది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లో పిటిషన్ను దాఖలు చేసింది. ఇప్పుడు దానినే సాకుగా చూపుతూ సీడబ్ల్యూసీ కొర్రీలు పెడుతుండటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం అనేక లేఖలు రాసిన దరిమిలా ఎట్టకేలకు ప్రజంటేషన్కు అనుమతించింది. తీరా ఇప్పుడు ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను సాకుగా చూపుతూ ఏకంగా డీపీఆర్నే వెనక్కి పంపింది. కృష్ణా నీటి కేటాంపులపై ట్రిబ్యునల్ ఎదుట విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో డీపీఆర్ను పరిశీలించలేమంటూ కొత్త మెలికను పెట్టింది. వాస్తవంగా సీడబ్ల్యూసీ లేవనెత్తిన అంశాలన్నీంటిపై తెలంగాణ ఇప్పటికే సమాధానాలు ఇచ్చింది.
కర్ణాటకకు ఒక నీతి.. తెలంగాణకు మరోనీతి
న్యాయవివాదంలో ఉన్న అంశాలను పరిశీలించలేమంటూ సాకులు చెబుతున్న సీడబ్ల్యూసీ కర్ణాటక చేపట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇవ్వడమేకాదు ఏకంగా జాతీయ హోదానే ప్రకటించింది కేంద్రం. ఉమ్మడి ఏపీకి సంబంధించి 45 టీఎంసీలను నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన మాత్ర మే, అదీ ఇన్బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా నొక్కిచెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కుతాయని రాష్ట్రప్రభుత్వం మొదటి నుంచీ వాదిస్తున్నది. వాస్తవంగా కూడా సాగర్ ఎగువ ఏపీకి ఎలాంటి ఇన్బేసిన్ ప్రాజెక్టులే లేవు. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయవివాదమే లేదని తెలంగాణ ఇప్పటికే సీడబ్యూసీకి స్పష్టం చేసింది. అయినా అదే అంశాన్ని పట్టుకుని కేంద్ర జలసంఘం డీపీఆర్ను వెనక్కిపంపటంపై తెలంగాణ ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు కర్ణాటక చేపట్టిన, ట్రిబ్యునల్ కేటాయింపులు లేని, సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న అప్పర్భద్ర ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.