తనిఖీల పేరుతో ఎఫ్సీఐతో కలిసి రాష్ర్టాన్ని బద్నాం చేస్తున్నారు
ఉచిత బియ్యం, డబ్బులిచ్చింది మేమే
ఈ నెల 18 నుంచి 26 వరకూ 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ
తనిఖీల కోసం కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
హైదరాబాద్; జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మాత్రం చిన్నచిన్న కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపేస్తామని, ఉచిత బియ్యం పంపిణీ చేయటంలేదని, రైస్మిల్లుల్లో ధాన్యం బస్తాలు మాయమవుతున్నాయని, రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎఫ్సీఐ లేఖ రాయడంపై ఆయన స్పందించారు. రెండు చిన్న కారణాలను బూచిగా చూపి తెలంగాణ నుంచి ధాన్యం సేకరించబోమని బెదిరిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్తో కలిసి బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.3,500 కోట్ల నష్టాన్ని భరించి ధాన్యాన్ని సేకరిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం అనువుగాని వేళల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తూ రాష్ర్టాన్ని బద్నాం చేస్తున్నదని మండిపడ్డారు. మార్చిలో 3,007 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించిన ఎఫ్సీఐ.. రాష్ట్ర ప్రభు త్వం సేకరించిన 162.54 లక్షల టన్నుల బ్యాగుల్లో కేవలం 0.7 శాతం (4,53,896 బ్యాగులు), 40 మిల్లుల్లో తేడాలు ఉన్నట్టు నివేదించిందన్నారు. దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖతో కలిసి మళ్లీ తనిఖీలు నిర్వహించిన ఎఫ్సీఐ.. 40 మిల్లుల్లో 30 సరిగానే ఉన్నట్టు సర్టిఫై చేసిందని గుర్తుచేశారు. తనిఖీల కోసం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని మంత్రి గంగుల తెలిపారు.
కేంద్రం కంటే ముందే ప్రారంభించాం
కరోనా వేళ 2020 మార్చిలో మోదీ సర్కారు కంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఉచిత బియ్యం, రూ.1,500 చొప్పున రెండు నెలలు అందించిందని మంత్రి గంగుల గుర్తుచేశారు. రాష్ట్రంలోని 90.46 లక్షల కార్డుదారుల్లో కేవలం 53 లక్షల మందికే కేంద్రం రేషన్ పంపిణీ చేస్తున్నదని చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 28న కేంద్రం నుంచి లేఖ వచ్చిందని, ధాన్యం సేకరణ కారణంగా పంపిణీలో జాప్యం జరిగిందని చెప్పారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు అదనంగా 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామన్నారు. ఈ నెలలో 18 నుంచి 26 వరకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
ఇండెంట్ ప్రకారమే ఇంధనం సరఫరా చేయాలి
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్కు కొరత రానీయబోమని మంత్రి గంగుల స్పష్టంచేశారు. బుధవారం చమురు మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇండెంట్ ప్రకారం పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేయాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు.