హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మోపేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ సర్చార్జిలను ప్రతి నెలా పెంచి వినియోగదారుల ద్వారా డిస్కంలు వసూలు చేయాలని ఈఆర్సీల మీద ఒత్తిడి పెంచుతున్నదని మండిపడ్డారు. దీనివల్ల ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ వినియోగదారులపై భారాలు వేయడానికి పూనుకుంటున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో ఇంధన సర్చార్జి పేరుతో ప్రతి నెలా యూనిట్కు 30 పైసల వరకు పెంచి వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్ఎసీ ఇచ్చిన ముసాయిదా ఉత్తర్వుల అమలును ఉపసంహరించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో పెంచిన విద్యుత్తు చార్జీలతోనే పేద గృహ వినియోగదారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఈ ముసాయిదా ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు.