ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం గండి
ఈ ఏడాది సుమారు 25 వేల కోట్ల కోత
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శ
వరంగల్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ సాధించి, రెండుసార్లు ప్రజల ఆమోదంతో సీఎం అయిన కేసీఆర్కు.. బోగస్ మాటలు మాట్లాడే బీజేపీ నేత బండి సంజయ్ ఎట్లా సరితూగుతాడని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బ్లాక్ మెయిలర్స్గా మారారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్నటి సభలో ఒకరైనా జై తెలంగాణ అన్నారా? బీజేపీ వాళ్లకు తెలంగాణ మీద ప్రేమ లేదని మరోసారి స్పష్టమైంది. మేము ఎన్నికల హామీలు నెరవేర్చడమే కాదు.. మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో కొత్త పథకాలు, కార్యక్రమాలను పూర్తి చేశాం. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి ఎన్నో పథకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకున్నా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి 335 ఎకరాల స్థలం, 2019లోనే రూ.15 కోట్లు కేటాయించినా కేంద్రం ఇప్పటికీ మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు ఫ్యాక్టరీ ఏమయ్యాయో అమిత్షా, కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ కింద గతంలో రాష్ర్టానికి రూ.98 వేల కోట్లు వచ్చేవని, కేంద్రం ఇప్పుడు రూ.73 వేల కోట్లకు కుదించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కేసీఆర్ స్వతహాగా రైతు. రోజూ వ్యవసాయం చూసుకొంటున్నారు. ఆయన ఉండేది ఫామ్హౌస్ కాదు. ఫార్మర్ హౌస్’ అని స్పష్టం చేశారు.