Elevated Corridor | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితోపాటు హైదరాబాద్-నాగ్పూర్ జాతీ య రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. జనవరి 5న సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి రక్షణ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖ అందజేశారు. వీటి నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు, ఆ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగురోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్ హైవే (ఎన్హెచ్ -44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెకర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రిని కోరారు. కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనున్నది. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ధి పరుగులు తీయనున్నది. దీంతో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి.
సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి నేడు ఫలితాలను ఇస్తున్నది. పదేండ్లుగా కేంద్రంతో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోరుకు రక్షణ శాఖ దిగొచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని రాజీవ్ రహదారి, 44వ జాతీయ రహదారిలో స్కైవేల నిర్మాణానికి నిరుడు జూలై 31న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయానికి రక్షణ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఆ మార్గాలలోని రక్షణశాఖ స్థలాలను కేటాయించాలని గత ప్రభుత్వం పదేండ్లుగా కేంద్రాన్ని కోరుతూ వచ్చింది.
ఎట్టకేలకు దీనిపై సానుకూలంగా స్పందించిన రక్షణశాఖ ఆయా రహదారుల్లో తన ఆధీనంలో ఉన్న 33 ఎకరాలను గతంలోనే కేటాయించగా, తాజాగా మరో 150 ఎకరాలను కేటాయిస్తూ శుక్రవారం ఆమోదం తెలిపిందని కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్నాయక్ వెల్లడించారు. రక్షణ శాఖ నుంచి భూసేకరణలో వచ్చిన అడ్డంకులతో ఈ పనులు ఆదిలోనే ఆగిపోయాయి. అయితే అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఢిల్లీలో పలుమార్లు సమావేశమై సమస్యను వివరించడంతో కేంద్ర రక్షణశాఖ ఇప్పటికి మేల్కొనడంతో కంటోన్మెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.