హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపునకు గురవుతున్న ప్రాంతాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ బాధ్యతలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సర్వే అనంతరం రక్షణ చర్యలపై చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ ముంపు, ఇతర సాంకేతిక సమస్యలపై బుధవారం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
పోలవరం బ్యాక్వాటర్ వల్ల భద్రాచలంతోపాటు అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని, బ్యాక్వాటర్పై పూర్తిస్థాయి అధ్యయనంతోపాటు, నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ తరపున ఈఎన్సీ నాగేందర్రావు గట్టిగా డిమాండ్ చేశారు. గతంలో నిర్ధారించిన 106 గ్రామాలే కాకుండా, అదనంగా 60 గ్రామాలకు ముంపు సమస్య ఉన్నదని, పోలవరం డ్యామ్ 146 మీటర్ల వద్ద నీటి నిల్వ ఉంచితే దుమ్ముగూడెం వరకు బ్యాక్వాటర్ నిలిచి ఉంటుందని అన్నారు. ఫలితంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో కుడి, ఎడమల నుంచి వచ్చి నదిలో కలువాల్సిన కిన్నెరసాని, ముర్రేడు, పెద్దవాగు, ఎద్దులవాగుతోపాటు ఇతర వాగులు పూర్తిస్థాయిలో కలువక లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని వివరించారు.
సర్వే బాధ్యత పీపీఏకు
తెలంగాణ వాదనలు, అందజేసిన ఆధారాలతో సీడబ్ల్యూసీ ఏకీభవించింది. కొన్నేండ్లుగా అడుగుతున్న పోలవరం ఎఫ్ఆర్ఎల్ ముంపు ప్రాంతాల జాయింట్ సర్వేకు సీడబ్ల్యూసీ చైర్మన్ అంగీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లోని 6 గ్రామాల్లో 899 ఎకరాలు ముంపు పరిధిలోకి వస్తాయని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లలో మార్ చేసి చూపించారని తెలంగాణ నివేదించగా, తక్షణమే సంయుక్త సర్వే చేపట్టాలని నిర్ణయించారు.
సర్వేకు ఏపీ ససేమిరా అని వాదించినా సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీ సహకరించినా, సహకరించకున్నా జాయింట్ సర్వే కొనసాగుతుందంటూ ఆ బాధ్యతను పీపీఏకు అప్పగించారు. అలాగే భద్రాచలంలోని 8 అవుట్ ఫాల్ తూముల విషయంలో తెలంగాణ చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని సంయుక్త సర్వే నిర్వహించాలని కూడా సీడబ్ల్యూసీ నిర్ణయించింది. మణుగూరు భారజల ప్లాంట్, భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లో సర్వే చేసి ముంపు ప్రాంతాలను గుర్తించాలని పీపీఏను ఆదేశించింది. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇంటర్ స్టేట్ గోదావరి డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
ఆది నుంచి తెలంగాణ గట్టి వాదనలు
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాచలంతోపాటు అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం ఉన్నదని ఆది నుంచి తెలంగాణ సర్కారు గట్టిగా వాదిస్తున్నది. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనంతోపాటు, నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నది. గోదావరి వరద ప్రవాహాల తీరు, గతంలో వచ్చిన వరదలు, ఇటీవల వచ్చిన వరద లెక్కలను సరిపోల్చడంతోపాటు శాటిలైట్ చిత్రాలను తెలంగాణ ఇంజినీర్లు సేకరించారు. ప్రాజెక్టు ముంపునకు సంబంధించిన ఆధారాలన్నింటినీ క్రోడీకరించి దాదాపు 45 పేజీల ప్రజెంటేషన్ను సీడబ్ల్యూసీకి అందజేయడంతో ఎట్టకేలకు దిగొచ్చి జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించింది.