మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపివేయగా.. అయినా పనులు జరుగుతున్నాయని ఇటీవల పలువురు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాస్తవంగా పనులు జరుగుతున్నాయా? లేదా? పరిశీలించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ ఓ కమిటీని నియమించింది.
కమిటీ రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు బుధవారం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు, పంప్హౌస్, టన్నెళ్లను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. ప్రతి అంశంపై అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం పనులేవీ జరుగడం లేదని కమిటీ బృందం గుర్తించినట్లు సమాచారం. గురువారం సైతం కమిటీ పర్యటన కొనసాగనున్నది.