హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వం వహిస్తారు. వ్యవసాయం, ఫైనాన్స్, జలవనరుల శాఖ, విద్యుత్తు, రోడ్డు రవాణా, రహదారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి వివిధ శాఖలు, విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనేది ఈ బృందమే కేంద్రానికి సిఫార్సు చేయనున్నది.