హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం ప్రాణ నష్టం జరుగకుండా చేసిన కృషిని కేంద్ర బృందం ప్రశంసించింది. భారీవర్షాల కారణంగా జరిగిన వర ద నష్టాన్ని అంచనా వేయడానికి రెండు రోజులుగా కేంద్ర బృందం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ నెల 20న రాష్ర్టానికి చేరుకొన్న కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు రెండు బృందాలుగా వివిధ జిల్లాలను సందర్శించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో కలిసి ఒక బృందం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించింది. మరో బృందం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాల్లో తిరిగి నష్టాన్ని అంచనా వేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా నీటిపారుదల వ్యవస్థ, రోడ్లు, ఇతర శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. అనంతరం శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకొని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిశారు. రాష్ట్రంలో పర్యటించి, నష్టం పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బృందాల్లో హోంశాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రే, డిప్యూటీ సెక్రటరీ పార్తిబన్, డైరెక్టర్లు మనోహరన్, రమేశ్ కుమార్, దీప్శేఖర్, శివకుమార్ కుష్వాహా, కృష్ణప్రసాద్ ఉన్నారు.
భద్రాచలం వరద నష్టం రూ.129 కోట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద కారణంగా రూ.129 కోట్ల నష్టం జరిగినట్టు కలెక్టర్ అనుదీప్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. నిర్మల్ జిల్లాలో వరదల కారణంగా 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా రూ.19.76 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ ముషారఫ్ అలీఫారూఖీ కేంద్ర బృందానికి వివరించారు. 69 పీఆర్ రోడ్లకు రూ. 30 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.