కరీంనగర్ కమాన్చౌరస్తా, మార్చి 11 : కరీంనగర్ జిల్లా రచయితకు అనువాద రచనల్లో కేంద్ర సాహిత్య అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సంవత్సరానికి అనువాద బహుమతి కోసం 24 పుస్తకాలను ఎంపిక చేసింది. అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిక్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో సోమవారం సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ పుస్తకాల ఎంపికను ఆమోదించింది. అందులో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర ‘ఎలనాగ’ పేరిట 2017లో అనువాదం చేసిన ‘గాలిబ్ నాటి కాలం’ నవలకు పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యులు సోమవారం ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
కాగా, ఈ నవల ఇంగ్లిష్లో ‘గాలిబ్ : ది మ్యాన్ ది టైమ్స్ బయోగ్రఫీ’ పేరిట పవన్ కే వర్మ రచించగా, నాగరాజు సురేంద్ర తెలుగులో ‘గాలిబ్ నాటి కాలం’ పేరుతో అనువదించారు. కాగా రచయితకు ఈ అవార్డుతోపాటు రూ.50 వేల నగదు, ఒక రాగి ఫలకాన్ని అందించనున్నారు. కాగా నాగరాజు సురేంద్ర కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించారు. 1980 నుంచి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ దవాఖానల్లో, ఆ తర్వాత 1989 నుంచి 2012 వరకు ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్లో పని చేసి, రాష్ట్రస్థాయి అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. హైసూల్లో ఉన్నప్పటినుంచే రచనలు చేయడం మొదలు పెట్టారు.