హైదరాబాద్/సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు రచయిత, కథా సాహిత్య శిఖరం కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం ఉదయం మరణించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఒక దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రంగసాయిపురం ఆయన స్వస్థలం. సాహిత్యంలో పీహెచ్డీ పూర్తిచేసిన ఆయన అనంతపురంలోని కృష్ణదేవరాయ వర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ (బీఆర్ఏఓయూ)లో తెలుగు విభాగం హెచ్వోడీగా, పలు విభాగాలకు డైరెక్టర్గా సేవలందించారు. ఓపెన్ యూనివర్సిటీ తెలుగు వాచకాల నిర్మాణంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రామాణిక గ్రంథాలను తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని విభాగించి, చకటి ముందుమాటలతో సంపుటాలు తెచ్చిన ఖ్యాతిని దక్కించుకున్నారు. ఆయన రచించిన ఇచ్ఛాగ్ని కథలు, జప్తు, కేతు విశ్వనాథరెడ్డి కథలు పేరుతో మూడు సంపుటాలు వెలువడ్డాయి. బోధి, వేర్లు అనే రెండు నవలలు రచించారు. సాహిత్య అకాడమీ అవార్డు సహా ఇతర అనేక అవార్డులను అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా పలు పర్యాయాలు పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
ప్రముఖుల సంతాపం
కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ కే సీతారామారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ఆర్ రెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, కోయ చంద్రమోహన్, కిశోర్తోపాటు పలువురు సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మృతి సాహిత్యరంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.