బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 17: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది మోసమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నలే అని, అలాంటి అన్నదాతల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరుతో వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందళోన వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్లో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. మరో 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా వర్ని, చందూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నష్టపోవద్దని, కష్టమైనా, నష్టమైనా రైతు శ్రేయస్సే ముఖ్యమని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకూ నీడ కల్పించడమే తన లక్ష్యమని స్పీకర్ స్పష్టంచేశారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర వాసులు మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఆశ్చర్య పోతున్నారని తెలిపారు.